సుప్రీం చీఫ్ జస్టిస్పై తిరుగుబాటు: ఎవరీ చలమేశ్వర్?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై తిరుగుబాటు ప్రకటించిన న్యాయమూర్తుల్లో ప్రధాన పాత్ర జస్టిస్ చలమేశ్వర్దే. ఆయన చొరవ కారణంగానే ఆయనతో పాటు నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టారు.
Recommended Video
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్ మీట్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జస్టిస్ చలమేశ్వర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంలో జాప్యం జరిగింది. ఆ కారణంగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.
తండ్రి ప్రఖ్యాత న్యాయవాది
ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జాస్తి చలమేశ్వర్ తండ్రి మచిలీపట్నంలో ప్రఖ్యాత న్యాయవాది. చలమేశ్వర్ 1953 జూన్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవిలో జన్మించారు. తాత నాగభూషణం వద్ద పెరుగుతూ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బందరు హిందు పాఠశాలలో చదివారు.
విశాఖ నుంచి న్యాయశాస్త్ర పట్టా...
మద్రాసు లయోలా కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత విశాఖపట్నం ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.1976లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఎన్నికల చట్టాలు, పన్నుల చట్టం, ఆదాయం పన్ను చట్టం, నేరచట్టం తదితర విభాగాల్లో అనుభవం సంపాదిచారు.
లోకాయుక్త సలహాదారుగా, ఇంకా..
చలమేశ్వర్ 1995, 1996 మధ్య కాలంలో లోకాయుక్త సలహాదారుగా పనిచేశారు. 1988 -89లో హోం శాఖ న్యాయవాదిగా పనిచేశారు. 1995లో అదనపు అడ్వొకేట్గా నియమితులయ్యారు. 1997లో అదనపు న్యాయాధిపతిగా, 1999లో న్యాయాధిపతిగా నియమితులయ్యారు.
తెలుగు సాహిత్యమంటే అభిమానం...
ప్రముఖ తెలుగు కవులు అద్దేపల్లి లక్ష్మణస్వామ, మల్లంపల్లి నాగమల్లేశ్వర శర్మ వద్ద తెలుగు సాహిత్యాన్ని అభ్యసించారు. తెలుగు సాహిత్య సభలకు ఆయన ఇప్పటికీ పంచె, లాల్చీ, కండువ ధరించి హాజరవుతారు. చిత్రలేఖనం కూడా ఆయనకు ఆసక్తి. ఆయన అస్సాం, కేరళ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
నిత్యం యోగా, నడక...
వ్యవసాయం అంటే చెప్పలేనంత అభిమానం. ప్రతి రోజూ యోగా చేసి, 6,7 కిలోమీటర్లు నడుస్తుంటారు. గత 20 ఏళ్లుగా ఆయన శాకాహారమే తీసుకుంటున్నారు. విద్యనభ్యసిస్తన్న కాలంలోనే లక్ష్మీ నళినితో వివాహం జరిగింది.