10 వేల కిలోమీటర్లు.. 24 పర్వాతాలు: అసలు లాంగ్ మార్చ్ కథే వేరు: చరిత్రలో చెరిగిపోని అధ్యాయం
విశాఖపట్నం: కొద్దిరోజులుగా రాష్ట్రంలో మారుమోగిపోతున్న పేరు.. లాంగ్ మార్చ్. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఆందోళన ఇది. విశాఖపట్నం వేదికగా మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. ఇసుక కొరత ఏర్పడటం వల్ల నిర్మాణరంగం స్తంభించిపోయిదని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, దీనికి కారణం- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వమే అనేది జనసేన ఆరోపణ. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొనబోతున్నారు.
టీడీపీ మినహా..
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆరంభం కానుంది. రామాటాకీస్, అశీల్ మెట్ట మీదుగా సాగుతుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ముగుస్తుంది. ఈ రెండింటి మధ్య దూరం రెండున్నర కిలోమీటర్లేనని, దీనికి లాంగ్ మార్చ్ అని పేరు పెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఈ ప్రదర్శనకు తెలుగుదేశం పార్టీ ఒక్కటే మద్దతు పలికింది. జనసేన మిత్రపక్షమైన సీపీఐ, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీలతో పాటు బీజేపీ దీనికి మద్దతు ఇవ్వలేదు.
అసలు లాంగ్ మార్చ్.. దాని కథే వేరు
రెండున్నర కిలోమీటర్ల దూరానికి లాంగ్ మార్చ్ అని పేరు పెట్టారనే విమర్శల మాటెలా ఉన్నా.. అసలు లాంగ్ మార్చ్ కథే వేరు. ఓ కమ్యూనిస్టు దేశ చరిత్ర స్థితిగతులను మార్చేసిన సంఘటన అది. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతంగా చైనా ఆవిర్భవించడానికి కేంద్రబిందువైన సందర్భం అది. లక్షలాది మంది పాల్గొన్న చైనా లాంగ్ మార్చ్.. పేరుకు తగ్గట్టు సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. చైనా లాంగ్ మార్చ్ 10 వేల కిలోమీటర్లు. ఏడాదిన్నర కాలం పాటు ఈశాన్య ప్రాంతం నుంచి వాయువ్య చైనా వరకు కొనసాగింది. చైనా పితామహుడిగా పేరున్న మావో జెడాంగ్ ను సర్వశక్తిమంతుడైన నేతగా ఆవిర్భవించడానికి కారణమైన లాంగ్ మార్చ్ అది.
24 పర్వతాలు.. 18 నదులు..
చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వేలాది మంది రెడ్ ఆర్మీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. 1934 నుంచి 1935 వరకు దశలవారీగా కొనసాగింది. 24 పర్వత శ్రేణులు, 18 నదులను దాటుకుని నిర్దేశిత గమ్యాన్ని అందుకున్నారు రెడ్ ఆర్మీ సభ్యులు. చైనా ఈశాన్య ప్రాంతంలోని జియాంగ్ఝీ ప్రావిన్స్ నుంచి వాయవ్య ప్రాంతంలోని షాంగ్ఝీ వరకు కొనసాగింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వెనుదిరగలేదు రెడ్ ఆర్మీ. ఈ రెండు ప్రావిన్స్ ల మధ్య 10 వేల కిలోమీటర్ల దూరం వరకు నడిచారు. నిర్దేశిత మార్గంలో పర్వత శిఖరాలు, నదులు ఎదురైనా మడమ తిప్పలేదు. వాటిని అధిగమించి, గమ్యస్థానానికి చేరుకున్నారు.
మావో సారథ్యం..
చైనా దశ, దిశను సమూలంగా మార్చేసిన లాంగ్ మార్చ్ ఇది. ఆధునిక చైనాకు బీజం పడిందీ అక్కడే. చైనాను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన మావో జెడాంగ్ ఈ లాంగ్ మార్చ్ కు నాయకత్వాన్ని వహించారు. ఈ లాంగ్ మార్చ్ తరువాత ఆయన తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. పీపుల్స్ ఆర్మీని సర్వశక్తిమంతమైనదిగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టగలిగారు. చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలిచిపోయింది. అలాంటి ఘన చరిత్ర ఉన్న లాంగ్ మార్చ్ పేరును జనసేన పార్టీ తన ఆందోళనకు పెట్టుకోవడం వల్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి. రెండున్నర కిలోమీటర్ల దూరానికి లాంగ్ మార్చ్ అని పేరు పెట్టడం పట్ల రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.