పుణ్యక్షేత్ర పరిసరాల్లో హైటెక్ సెక్స్ రాకెట్: యువతులు, నిర్వాహకురాలి అరెస్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతిలో రహస్యంగా సాగిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, చెన్నై, ముంబైల నుంచి కొంతమంది వ్యక్తులు తిరుపతిని కేంద్రంగా.
తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతిలో రహస్యంగా సాగిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, చెన్నై, ముంబైల నుంచి కొంతమంది వ్యక్తులు తిరుపతిని కేంద్రంగా ఈ వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, నిర్వాహకులను, యువతులను, విటులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఎవరికీ అనుమానం రాకుండా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో అద్దెకు ఇళ్లు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ, పేద యువతులకు మాయమాటలు చెప్పి ఈ రొంపిలోకి దింపుతున్నారు. విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు.
అవిలాలలోని పేపర్స్ కాలనీలో వ్యభిచార ముఠా కార్యకలాపాలు జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా, నిందితుల్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత కూడా ఉన్నట్లు తెలిసింది. చెన్నైకి చెందిన ఓ మహిళ అవిలాలలో ఇంటిని అద్దెకు తీసుకుని నిరుద్యోగ యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతోందని పోలీసులు తెలిపారు.
చెన్నై, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారితో పరిచయాలను ఏర్పరచుకుని వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పారు. హైవేలపై వాహనాల్లో వెళుతున్న వారిని ఆకర్షించేలా ఆ యువతులను రోడ్లపై నిలబెట్టి.. వాహనాలను ఆపిన వారిని తమ స్థావరాలకు తీసుకెళ్లి పని కానిచ్చేస్తున్నారు. ఇలా నిర్వాహకులు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.
వ్యభిచార కార్యకలాపాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఓ కన్నేసిన పోలీసులు.. నిర్వాహకురాలు సరోజమ్మను, పలువురు యువతులు, విటులను అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పవిత్రస్థలంలో ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తుండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.