ఆళ్లగడ్డ ఉప ఎన్నిక జరపండి: ఈసీకి హైకోర్టు ఆర్డర్
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. కోర్టు తదుపరి వెలువరించే తీర్పునకు లోబడి ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఆళ్లగడ్డ శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు గురువారం ఆదేశాలను జారీ చేసింది.
దాదాపు నాలుగు నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శోభా నాగి రెడ్డి పోటీ చేశారు. అయితే, ఎన్నికలకు ముందు ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అయితే, ఆమె పేరును ఈసీ తొలగించలేదు. అనంతరం జరిగిన ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి గెలుపొందారు. ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నికలు జరపాల్సి ఉంది.