ఎపిలో హోలీటెక్ పెట్టుబడులు...ఇండియాలో ఇదే మొదటి ఫ్యాక్టరీ : మంత్రి లోకేష్
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ సంస్థ రానుంది. అది చైనా ప్రఖ్యాత సంస్థ హోలీటెక్ కాగా ఫోన్ల విడిబాగాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో తన కర్మాగారం నెలకొల్పనుంది.
ఈ మేరకు మంత్రి లోకేష్ సమక్షంలో హోలీ టెక్ సంస్థ ఎపి ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ హోలీటెక్ సంస్థతో ఒప్పందం కుదిరిన విషయాన్ని, ఒప్పందం తాలూకూ వివరాలను వెల్లడించారు. ఆ సంస్థకు చైనాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయని, భారత దేశంలో మాత్రం ఇదే మొదటి ఫ్యాక్టరీ అని లోకేష్ తెలిపారు.
విదేశీ పర్యటనలు...ఫలితం
ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల కోసం చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాన్నిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ, చైనా కు చెందిన హోలీ టెక్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి లోకేష్ సమక్షంలో ఆ సంస్థ ఎపి ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంపెనీ స్థాపన ద్వారా ఆరు వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిసింది. ఈ కంపెనీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కృషి ఫలించి.. ఎట్టకేలకు ఏపీలో కర్మాగారం ఏర్పాటుకు సదరు కంపెనీ అంగీకరించింది.
అంతా సీక్రెట్...ఆపరేషన్
ఈ కంపెనీ కోసం ఇతర రాష్ట్రాలు కూడా తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో దీని పేరు, తమ ప్రయత్నాల వివరాలను రాష్ట్రం ఏమాత్రం బయటకు వెల్లడించకుండా జాగ్రత్త వహించింది. హోలీటెక్ ప్రతినిధులు సోమవారం ఎపి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మంత్రి లోకేష్ ఈ సంస్థ వివరాలు బైటకు వెల్లడించారు. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా హోలీటెక్ రూపంలో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కర్మాగారం రాష్ట్రానికి వస్తోంది. ఇప్పటికే ఫ్లెక్స్ట్రానిక్స్ లాంటి ప్రసిద్ధ కంపెనీలు ఎపికి తరలిరాగా...ఇప్పుడీ జాబితాలో హోలీటెక్ కూడా చేరింది.
కంపెనీ నిర్మాణం...తదిదర వివరాలు
తిరుపతిలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ. 1400 కోట్ల పెట్టుబడులతో ఈ కర్మాగారం ఏర్పాటుచేస్తారు. ఇప్పటివరకు మన దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలన్నీ కేవలం అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నాయి. అంటే విడిభాగాలను తీసుకొచ్చి అమర్చుతున్నాయి. కానీ ఈ హోలీటెక్ కంపెనీ ద్వారా తొలిసారి దేశంలో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కర్మాగారం రాష్ట్రానికి రానుంది. ఈ కంపెనీ ఏపీలో ఐదు ప్రొడక్ట్లు తయారు చేయడానికి ఒప్పందం జరిగిందని తెలిసింది. 1. టిన్ ఫిలిమ్ ట్రాన్సిస్టర్, 2. లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, 3. కేపాసిటర్ టచ్ స్ర్ర్కీన్, 4. సీసీఎం (కాంపోనెట్ కేమ్రామోడ్యూల్), 5. ఫింగర్ ప్రింట్ మాడ్యూల్. ఈ ఐదు మాడ్యూల్స్ను ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేయాలనేది వారి ఆలోచనగా అని మంత్రి లోకేష్ తెలిపారు.
మరికొన్ని...సంస్థలతో ఒప్పందం
అలాగే భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీస్ సంస్థ ‘బెస్ట్'...ఈ సంస్థ కూడా రాష్ట్రంలో బ్యాటరీల తయారీ కర్మాగారం పెట్టనుంది. రూ.660 కోట్లతో దీన్ని స్థాపించనున్నారు. ఫలితంగా మూడేళ్లలో మూడువేల ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలకు భిన్నంగా ఈ కొత్త బ్యాటరీ ఉంటుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ బ్యాటరీ పెట్టేందుకు పెద్దగా స్థలం కూడా అవసరం ఉండదని తెలిసింది. ఒక క్యూబిక్ మీటర్ స్థలంలోనే మెగావాట్ పవర్ ఉన్న బ్యాటరీని పెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్రిక్ గ్లిన్ దీనిని ఆవిష్కరించారు.
చంద్రబాబు విజన్...హోలీటెక్ ఆశ్చర్యం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తొలిసారి మాట్లాడినప్పుడు ఆయన విజన్, స్పష్టత చూసి ఆశ్చర్యపోయామని హోలిటెక్ సంస్థ ప్రతినిధి మనోజియన్ ఒప్పందం సందర్భంగా చెప్పారు. అప్పుడే ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఇండియాలో పెట్టుబడులకు ఏపీనే అనువైన రాష్ట్రమని నిర్ణయించామని ఆయన అన్నారు. ఏపీలో తాము అతిపెద్ద కంపెనీ ఏర్పాటుచేయనున్నట్లు మనోజియన్ తెలిపారు.