చంద్రబాబు అమెరికాటూర్: సచివాలయంలో సెలవు వాతావరణం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గురువారం నాడు అప్రకటిత సెలవు వాతావరణం కన్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన నేపథ్యంలో లోకేష్ సహా ఇతర మంత్రులెవరూ కూడ సచివాలయానికి రాలేదు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గురువారం నాడు అప్రకటిత సెలవు వాతావరణం కన్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన నేపథ్యంలో లోకేష్ సహా ఇతర మంత్రులెవరూ కూడ సచివాలయానికి రాలేదు.దీంతో అధికారులు కూడ కార్యాలయాల వైపు రాలేదు.
సచివాలయంలో పనిచేసే కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు సచవాలయం వైపు తొంగిచూడలేదు. దీంతో వివిధ శాఖలకు చెందిన కిందిస్థాయి అధికారులు కూడ సచివాలయం వైపు రాలేదు.
కార్యాలయాల్లో అత్యధికంగా ఖాళీగా కన్పించాయి. ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు ఉన్నతాధికారులు, మంత్రులు సచివాలయానికి రాని పరిస్థితి కన్పించింది. బుదవారం నాడు ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఆ రోజే మధ్యాహ్నం సచివాలయం నుండి కొందరు అధికారులు వెళ్ళిపోయారు.
గురువారం నాడు మంత్రులు కూడ సచివాలయానికి రాలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మంత్రులు కూడ సచివాలయానికి రాలేదు. సచివాలయంలో ప్రతి శుక్రవారం నాడు ప్రజా వినతుల రోజుగా నిర్వహిస్తున్నారు.
శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం నుండే అధికారులు, ఉద్యోగుల్లో చాలామంది సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నారు.దీంతో సమస్యలను విన్నవించేందుకు సుదూర ప్రాంతాల నుండి వస్తున్న బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో అధికారులకు వెసులుబాటె కల్పించేందుకు ప్రజా వినతుల రోజును గురువారానికి ముఖ్యమంత్రి మార్చారు. కానీ, గురువారం నాడు కూడ అధికారులు, మంత్రులు అందుబాటులో లేకుండాపోయారు. ఆరోగ్య సమస్యలు, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం కోరేందుకు వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు వారికి సమాధానం చెప్పేవారు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.