బొకారో ఎక్స్ప్రెస్లో ఉన్మాది వీరంగం: రైలు నుంచి తోసేయడంతో హోంగార్డు మృతి
తూర్పుగోదావరి: తుని రైల్వేస్టేషన్ వద్ద ఆలెప్పి నుంచి ధన్బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో ఓఉన్మాది సృష్టించిన బీభత్సానికి ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ఆగంతకుడు ప్రయాణికులతో గొడవపడి వారిని కిందకు నెట్టేందుకు యత్నించాడు.
ఈ క్రమంలో ఎస్7 బోగిలో ఉన్న కోటనుందూరుకు చెందిన హోంగార్డ్ వెంకటశివ(35) వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో అతడు ఆ ఉన్మాదిని వారించేందుకు ప్రయత్నించాడు. అయితే, హోంగార్డును ఆ ఉన్మాది రైల్లోంచి కిందకు తోసేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన వెంకటశివ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన తుని రైల్వే రైల్వే స్టేషన్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు రైలు తుని స్టేషన్ కు రాగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు బంగ్లాదేశ్ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం
శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం వద్ద యాత్రికుల బస్సు మంటల్లో చిక్కుకుంది. రోడ్డుదాటుతున్న ప్రైవేటు బస్సును ఢీకొన్న యాత్రికుల బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లి అవతలవైపు ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో యాత్రికుల బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
పూరీ నుంచి రామేశ్వరం వెళ్తుండగా ఈ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో 50 మంది యాత్రికులు ఉండగా, వారంతా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం గాయపడినవారి పరిస్థితి నిలకడగా ఉంది.