దారుణం : మహిళా పీఎస్లో పనిచేస్తూ.. మైనర్ బాలికను గర్భవతి చేసిన హోంగార్డు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. బందరు మహిళా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కారు డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డు ఫణీంద్ర ఓ మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. మాయ మాటలతో ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. బాధితురాలు ఫణీంద్రపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఓ ఆడపిల్లపై అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. దీనిపై ఏఎస్పీ నుంచి నివేదిక తెప్పించుకున్న ఎస్పీ.. ఫణీంద్రను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫణీంద్రపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. రవీంద్రబాబు 2012లో హోంగార్డుగా చేరినట్టు తెలుస్తోంది. ఎస్పీ,డీఎస్పీ వాహనాలనకు అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తాజా ఘటనపై స్థానిక మహిళా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో స్పందించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
కాగా,ఏపీలో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. చిత్తూరులో ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన శనివారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బహిర్భూమికి వెళ్లిన సమయంలో.. ఆమెను అడ్డగించిన యువకులు.. బలవంతంగా ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే బాలిక అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకుని యువకులను పట్టుకున్నారు.
ఆపై వారికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు,దిశ చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంతో ఇంకా అమలులోకి రాలేదు. దిశ చట్టం ప్రకారం 14 రోజుల్లో విచారణ పూర్తవ్వాలి. దోషులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడాలి.ఈ చట్టం అమలు కోసం 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత ఇటీవలే స్పష్టం చేశారు.