విజయసాయి ‘సీబీఐ’ లేఖపై స్పందించిన హోంమంత్రి అమిత్ షా: ఆ లేఖలో ఏం రాశారంటే.?
న్యూఢిల్లీ/అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేని అధికారిని నియమించాలని లేఖ రాశారు ఎంపీ విజయసాయి. విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించారు అమిత్ షా.
అలాంటి వ్యక్తినే నియమించండి..
‘విజయసాయి రెడ్డి తన లేఖలో ప్రస్తావించిన వివరాలిలా ఉన్నాయి. ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్లో సీబీఐ జేడీ నియమించాలి. చట్టప్రకారం నడుచుకునే వ్యక్తిని దేశ ప్రయోజనాల రీత్యా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ మాజీ సీఎం చంద్రబాబు నాయడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు'
వైఎస్ జగన్ ఇబ్బందులను సృష్టించేందుకు..
వైయస్ జగన్ను ఇబ్బందులు సృష్టించేందుకు ‘ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాయుడు నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు లక్ష్మినారాయణ.. చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు సృష్టించారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయాలపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగింది.
లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి పోటీ చేయాలనుకున్నారు..
లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీతో వ్యూహాత్మక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తనది ఆంధ్రప్రదేశ్ కాదని
మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆయన తల్లిదండ్రుల అంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీ ఉన్న కాలంలో ఎస్పీగా పని చేశారు.
రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తినే సీబీఐ జేడీగా..
చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకొని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో జరిగిన భారీ అవినీతి నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసం తన అధికారులను సీబీఐ హైదరాబాద్లోకి నియమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ సీబీఐ జేడీగా నియామకాలు దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా నియమించాలి అని కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో విజయసాయి రెడ్డి కోరారు.