మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే .. ఉనికి కోల్పోతామనే విమర్శలు : హోం మంత్రి సుచరిత
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆమె పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించారని హోంమంత్రి సుచరిత తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వైయస్సార్ చేయూత పథకం పై సంతోషం వ్యక్తం చేస్తుంటే టిడిపి నేతలు తట్టుకోలేక విమర్శలు గుప్పిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.అమూల్, రిలయన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మహిళలను మోసం చేసిన చంద్రబాబు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చెయ్యలేదని విమర్శించారు.
మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి సుచరిత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలు ఆర్థికంగా స్థిరపడటానికి పలు నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసిన ఘనత, అమ్మ ఒడి,చేయూత పథకాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.
30 లక్షల మంది మహిళలకు సంతోషం కలిగేలా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, టిడిపి నేతలు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. టిడిపి నేతలు తమ ఉనికి కోల్పోతామన్న భయంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ టీడీపీ అమలు చేయలేదని,కేవలం కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శనాస్త్రాలు సంధించారు.