చంద్రబాబుపై విరుచుకుపడిన హోం మంత్రి సుచరిత... పాత ఘటనలు గుర్తుచేసి మరీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత టీడీపీ అధినేత చంద్రబాబుపై, టిడిపి నాయకులపై నిప్పులు చెరిగారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వారిపై వైసిపి ప్రభుత్వ హయాంలో దాడులు జరుగుతున్నాయని టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీ
టిడిపి హయాంలో ఎప్పుడైనా తక్షణ చర్యలు ఉన్నాయా?
చంద్రబాబు పాలన సాగించిన రోజుల్లో, టిడిపి హయాంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వైసిపి ప్రభుత్వ హయాంలో ఏదైనా ఘటన జరిగితే గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా తక్షణమే స్పందిస్తున్నామని, చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. బీసీల పేరుతో, దళితుల పేరుతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని ఆమె వ్యాఖ్యానించారు.
చంద్రబాబు దళిత ద్రోహి కాదా ?
దళితుల మీద ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు దళిత ద్రోహి కాదా ? అని ఆమె గతాన్ని గుర్తు చేసి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు దళితులుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని వ్యాఖ్యలు చేశారని , ఇక ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యలకు దళితులకు క్షమాపణ చెప్పలేదని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. అంతేకాదు టీడీపీ మంత్రులు దళితులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆమె గుర్తు చేశారు.
టిడిపి హయాంలో మంత్రులు , ఎమ్మెల్యేలు దళితులు కించపరిచలేదా ?
గతంలో టిడిపి హయాంలో దళితులను ఉద్దేశించి మీకెందుకురా రాజకీయాలు అని దూషించిన నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆమె పేర్కొన్నారు. దళితులు స్నానం చేయడం మురికిగా ఉంటారని అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడితే ఏం చర్యలు తీసుకున్నారు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకూ దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు, దళితుల పై కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.
Recommended Video
వైసిపి హయాంలో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే చర్యలు
కేవలం రాజకీయాల కోసమే చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క అంశాన్ని వాడుకుంటున్నారని ఇటీవల జరిగిన సంఘటనలు అన్నింటిలోనూ, బాధ్యులు, అధికారులు అయినప్పటికీ చర్యలు తీసుకున్నామని, వారిపై కేసులు కూడా నమోదు చేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో న్యాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు లేవని, ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.