విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి దిగ్భ్రాంతి.. బాధితులను పరామర్శించిన మంత్రి అవంతి..
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సుచరిత ప్రగాఢ సానుభూతి తెలిపారు.విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్, మంత్రులు అవంతి శ్రీనివాస్,బొత్స సత్యనారాయణ మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద కారణాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, డిజాస్టర్ డీజీ అనురాధలతో మాట్లాడారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సుచరిత ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
బాధితులను పరామర్శించిన అవంతి..
మంత్రి అవంతి శ్రీనివాస్ ఇతర వైసీపీ నేతలతో కలిసి ఆర్ఆర్ వెంకటాపురం గ్రామాన్ని సందర్శించారు. అలాగే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని అన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోనే మోహరించామని.. ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు.గ్యాస్ లీకేజీ కారణంగా ఇళ్లు వదిలి వెళ్లిపోయినవారికి ప్రభుత్వమే భోజన సదుపాయం ఏర్పాటు చేస్తుందన్నారు.
ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్..
ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్ గ్యాస్ లీకేజీ ఘటనపై మాట్లాడుతూ.. గ్యాస్ పీల్చడం ద్వారా ప్రధానంగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులేనని చెప్పారు. విష వాయువులు ఊపిరితిత్తులకు చేరడంతో శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుందన్నారు. కాబట్టి గ్యాస్తో ప్రభావితమైనవారిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పించవచ్చన్నారు. ప్రాథమికంగా ఎమర్జెన్సీ మెడికల్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చికిత్స అందిస్తున్నారని.. న్యూరో సర్జన్స్ కూడా వచ్చి ట్రీట్మెంట్ అందిస్తారని చెప్పారు. కేజీహెచ్లో 300-400 మందికి ఆక్సిజన్ అందించే సదుపాయం ఉందన్నారు. ప్రస్తుతానికి అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.
Recommended Video
సీఎం ఉన్నత స్థాయి సమావేశం
మరోవైపు విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎస్ నీలం సాహ్ని,డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మరికాసేపట్లో ఆయన విశాఖ బయలుదేరే అవకాశం ఉంది. రోడ్డు మార్గం ద్వారానే ఆయన విశాఖ వెళ్తారని తెలుస్తోంది. నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా భయానక పరిస్థితులు అలుముకున్నాయి. ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టైరిన్ గ్యాస్ కారణంగా ఇప్పటివరకూ 8 మంది మృత్యువాతపడినట్టు తెలుస్తోంది. తాళ్లతో కట్టేసి ఉన్న మృతదేహాలు అక్కడికక్కడే మృతి చెందాయి. దాదాపు 200 పైచిలుకు మంది గ్యాస్ ప్రభావానికి గురై ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ వెంకటాపురంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.