మైలవరం జలాశయం గేట్లెత్తే క్రమంలో...మంత్రి ఆదిపై తేనెటీగల దాడి
కడప:మైలవరం జలాశయం గేట్లు ఎత్తేందుకు వెళ్లిన మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన దూరంగా పరుగెత్తి ముప్పు తప్పించుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయన ఈ ప్రమాదం ఎదుర్కొంది తేనెటీగల నుంచి...అయితే ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే...వైఎస్సార్ కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదలను చేసే కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, మండలి విప్ రామసుబ్బారెడ్డి, పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ లింగారెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి,అధికారులు,తెలుగుదేశం కార్యకర్తలు అక్కడకు భారీగా తరలివెళ్లారు.
ఈక్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి గేట్లు ఎత్తారు. అయితే చాలా రోజుల నుంచి గేట్లను కదిలించకుండా ఉంచడంతో ఈ గేట్లపై తేనెతుట్టెలు పెట్టి నివాసం ఏర్పరుచుకున్న తేనేటీగలు తమ గూళ్లు చెదిరిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలపై దాడి చేశాయి. ఒకేసారి భారీ సంఖ్యలో తేనెటీగలు దాడి చేయడంతో మంత్రి ఆదినారాయణ రెడ్డితో సహా నాయకులు, అధికారులు తోచిన దిక్కుకు పరుగులు తీశారు.
కొందరు ఉత్తర కాలువ గట్ల వెంబడి పరిగెత్తగా, మరికొందరు దక్షిణ కాలువ గట్టు వెంబడి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ తేనెటీగల దాడి నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి సురక్షితంగా తప్పించుకొని కారులోకి చేరుకోవడంతో అధికారులు, వ్యక్తిగత సహాయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ తేనెటీగల దాడిలో మైలవరం తహసీల్దారు షేక్ మొహిద్దీన్కు గాయాలైనట్లు సమాచారం. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకున్నట్లు తెలిసింది.