స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసు: మేనేజర్ వెంకటేశ్వర రావు కీలకం
విజయవాడ: విజయవాడలోని స్వర్ణ బార్లో జరిగిన కల్తీ మద్యం ఘటనలో బార్ మేనేజర్ వెంకటేశ్వర రావును కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావిస్తున్నారు. పాతికేళ్లుగా అతను మద్యం షాపుల్లో పనిచేస్తున్నాడు. దీంతో కల్తీ చేయడంలో అతను దిట్గగా భావిస్తున్నారు.
మత్తు ఇవ్వడానికి వెంకటేశ్వర రావు తెల్లటి పదార్థమేదో కలిపాడని పోలీసులకు లొంగిపోయిన కాంగ్రెసు నేత మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్య సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.
తెల్లటి సీసాలో ఉండే కెమికల్ను ఒక్క చుక్క మాత్రమే కలపాల్సి ఉండగా, ఎక్కువ మోతాదులో వెంకటేశ్వర రావు కల్పి ఉండవచ్చునని కూడా అతను చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కెమికకల్ మిథనాలా లేదా మరోటా అనే విషయం మాత్రం వెల్లడించడం లేదు.
కృష్ణ లంక స్వర్ణ బార్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మద్యం వ్యాపార పర్యవేక్షణ అంతా మల్లాది శ్రీనివాస్దేనని సిట్ బృందం గుర్తించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మద్యాన్ని కల్తీ చేసినట్లు అతను అంగీకరించాడని చెబుతున్నారు.
కల్తీ కోసం వాడే కెమికల్ను ఎక్కడి నుంచి తెస్తారనే విషయం మాత్రం చెప్పలేదని అంటున్నారు. విజయవాడలోని అన్ని బార్లలోనూ కల్తీ జరుగుతున్నట్లు బుల్లయ్య ఇచ్చిన సమాచారాన్ని బట్టి అర్థమవుతోందని అంటున్నారు.
ఈ నెల 7వ తేదీన కృష్ణలంక స్వర్ణ బార్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించగా, 31 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.