ఏటీఎం ఇష్యూ: విద్యార్ధిపై సినీ ఫక్కీలో దాడి చేయించిన కాలేజీ వార్డెన్
అమరావతి: విశాఖపట్నంలోని నర్వ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వార్డెన్ సినీ ఫక్కీలో ఓ విద్యార్ధిపై దాడి చేయించాడు. దీంతో కళాశాలలో ఉద్రిక్తత పరిస్ధితి చోటు చేసుకుంది. ఏటీఎం విషయంలో విద్యార్ధి సతీష్, వార్డెన్ జగన్మోహాన్ల మధ్య ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది.
పోలీసులు బాధితుల కథనం ప్రకారం నగరంలోని నర్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయ్కుమార్ అనే విద్యార్థి పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. వార్డెన్ జగన్మోహాన్ వద్ద అతడు గతంలో రూ.200లు అప్పుగా తీసుకున్నాడు. ఉదయ్ కుమార్ బ్యాంకు ఖాతాలో తండ్రి 20వేల రూపాయలు జమ చేయడంతో వార్డెన్కు ఏటీఎం కార్డు ఇచ్చి తనకు బాకీగా ఉన్న రూ. 200లను తీసుకోమని చెప్పాడు.
అప్పటికే పిన్ నెంబర్ తెలుసుకున్న వార్డెన్ వద్దులే నువ్వే తెచ్చి ఇవ్వు అని చెప్పాడు. అనంతరం విద్యార్ధి ఉదయ్ కుమార్ ఏటీఎం కార్డుని దొంగిలించి ఆ కార్డుని దొంగిలించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా మరో విద్యార్ధి సతీష్తో ఉదయ్కుమార్ ఏటీఎం కార్డును దొంగచాటుగా తెప్పించి, పిన్ నంబర్ చెప్పి అతడితోనే 10వేల రూపాయలు డ్రా చేయించాడు.
దీంతో తన ఏటీఎం కార్డు కనిపించకపోవడంతో సతీష్ని అడగ్గా అతడు జరిగిన విషయాన్ని ఉదయ్కు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఉదయ్కు సతీష్ జరిగిన విషయాన్ని చెప్పడంతో సతీష్పై ఆగ్రహించిన వార్డెన్ కొందరు విద్యార్ధులతో గురువారం రాత్రి అతడిపై దాడి చేయించాడు. తీవ్రంగా గాయపరచడంతో పాటు అతడిని కంప చెట్లలోకి విసేరినట్లు సతీష్ తెలిపాడు.
దీంతో సమాచారం అందుకున్న తోటి విద్యార్ధులు సతీష్ను చికిత్స నిమిత్తం గోపాలపట్నంలోని ఎస్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన వార్డెన్ జగన్మోహాన్కు సతీష్ కుటుంబ సభ్యులు, బంధువులు దేహశుద్ధి చేశారు. దీంతో వార్డెన్కు కూడా స్పల్ప గాయాలయ్యాయి.
ప్రస్తుతం అతడు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు సతీష్పై వార్డన్ దాడికి నిరసనగా విద్యార్ధులు ఆందోళనకు దిగారు. వార్డెన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏటీఎం విషయంలో వార్డెన్ తనపై దాడి చేయించినట్లు గాయపడ్డ విద్యార్ధి సతీష్ పోలీసులకు వివరించాడు.