ఉండవల్లి అఖిలపక్ష భేటీలో వాడిగావేడి చర్చ: 'పవన్ కళ్యాణ్ కమిటీలోనే చెప్పేశా.. ఐనా'
అమరావతి: మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. ఈ భేటీకి వైయస్సార్ కాంగ్రెస్, సీపీఎం మినహా మిగతా అన్ని మేజర్ పార్టీలు హాజరయ్యాయి. జనసేన తరఫున పవన్ కళ్యాణ్, టీడీపీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తులసి రెడ్డి, బీజేపీ నుంచి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు వచ్చారు.
కలిసివెళ్దాం రండి: జగన్-బాబులకు పవన్ కళ్యాణ్ కొత్త ఆఫర్, నాదెండ్ల-తోట పోటీ ఎక్కడి నుండి అంటే?
కేంద్రం సాయంపై అఖిలపక్షంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలు అంశాలపై ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. అయితే అన్ని పార్టీలు కూడా ఏపీకి సాయంపై ఎన్నికల అనంతరం కలిసి పోరు చేయాలని తీర్మానం చేశాయి. దీనికి అన్ని పార్టీలు ఏకీభవించాయి.
కేంద్రం సాయంపై టీడీపీ, కాంగ్రెస్ విమర్శలు
కేంద్రం సాయంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి తెలిపిందని వారు అన్నారు. బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు వారితో విబేధించారు. కేంద్రం వివరణ తీసుకోకుండా ఇంకా ఎంత ఇవ్వాలనేది తేల్చలేమని స్పష్టం చేశారు. ఉండవల్లి మాట్లాడుతూ.. విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదనే అంశంపై చర్చ జరగాలని ఉండవల్లి అన్నారు. కేంద్రం నెరవేర్చలని హామీలపై చర్చ జరిగితే బాగుంటుందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు కలిసి పని చేయాలని తీర్మానం చేశారు.
తిప్పికొట్టిన ఐవైఆర్
ఈ భేటీలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కేంద్రాన్ని కార్నర్ చేసే ప్రయత్నాలు చేశాయి. కానీ బీజేపీ నేత ఐవైఆర్ తిప్పికొట్టారు. కేంద్రం నుంచి నిధులు రావాలని, పోరాటానికి కలిసి రావాలని టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు డిమాండ్ చేశాయి. కానీ కేంద్రం నుంచి ఎంత వచ్చాయో తెలుసుకోకుండా చెప్పలేమని ఐవైఆర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తేల్చిందని మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్ బాబులు గుర్తు చేశారు. కేంద్రం లెక్కలు చెప్పేందుకు సిద్ధంగా లేదని లెఫ్ట్ నేత రామకృష్ణ అన్నారు.
దేశం దృష్టికి తీసుకెళ్దాం
అయితే, విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందనే విషయాన్ని దేశం దృష్టికి తీసుకు వెళ్దామని, అందుకు ప్రణాళిక రూపొందించాలని ఉండవల్లి అన్నారు. కేంద్రం నెరవేర్చని హామీలపై చర్చ జరగాల్సిందేనని మరికొందరు నేతలు అన్నారు. భేటీ అనంతరం ఉండవల్లి మాట్లాడుతూ... పవన్ రాకతో ఈ భేటీ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకు అందరూ అంగీకరించారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కమిటీ టైంలోనే చెప్పేశా
భేటీ అనంతరం ఐవైఆర్ కృష్ణారావు (బీజేపీ) మాట్లాడుతూ.. చట్టంలోనే అన్యాయం జరిగిందని తెలిపారు. కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు రావాల్సి ఉందని చెబుతున్నారని, కానీ తాను పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనే ఓ విషయం స్పష్టంగా చెప్పానని, రాష్ట్రం, కేంద్రం పరిష్కరించుకోవాల్సిన అంశమని చెప్పామన్నారు. ఇప్పుడు అదే చెప్పామన్నారు. కేంద్రం ఎంత ఇచ్చిందో తెలిస్తే ఎంత రావాల్సిందో అర్థమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీగా చేయకుండా (భాగస్వామిగా) ఎలా చెబుతామని అన్నారు. కేంద్రాన్ని పార్టీగా చేయకుండా ఏం చేసినా సరికాదని తాను ప్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమయంలోనే స్పష్టం చేశానని అన్నారు. అయినప్పటికీ ఆ కమిటీ ఏకపక్షంగా నిధులు ఇన్ని రావాలంటూ విడుదల చేసిందన్నారు. దీంతో సమస్య క్లిష్టంగా తయారయిందని అన్నారు. కేంద్రం అభిప్రాయాలు తీసుకొని రిపోర్ట్ ఇవ్వాలన్నారు. తనను ఎవరైనా ఆహ్వానిస్తే ప్రతి పాయింట్ పైన క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.