ఎక్కడినుంచో వచ్చి.. మమ్మల్నే బెదిరిస్తారా?: పీకె టీమ్తో వాగ్వాదం, హోటల్లో ఇలా!
'ఎక్కడినుంచో వచ్చి మమ్మల్నే బెదిరిస్తారా? ముందు బిల్లు కట్టి కదలండి' అంటూ హోటల్ యాజమాన్యం పీకే టీమ్ ను హెచ్చరించారట.
Recommended Video
కడప: పీకే టీమ్కు వైసీపీ నేతకు చెందిన ఓ హోటల్ యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర తీరు తెన్నుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు సలహాలు-సూచనలు అందిస్తోంది పీకే టీమ్.
ఈ క్రమంలో కడప జిల్లాలోని ఓ హోటల్లో బస చేసిన సందర్భంగా.. బిల్లు విషయమై గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలు రంగంలోకి దిగి హోటల్ యాజమాన్యానికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగినట్టు సమాచారం.
ఈ నెల 6న:
ఇడుపులపాయ నుంచి నవంబర్ 6న జగన్ తన పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి 15రోజుల ముందే ప్రశాంత్ కిశోర్ టీమ్ కడపకు చేరుకుంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో మకాం వేసి పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దం చేసింది.
నెల రోజులు అక్కడే మకాం:
నెల రోజుల పాటు అదే హోటల్లో మకాం వేసిన పీకే టీమ్.. పాదయాత్రకు సంబంధించి చాలానే కసరత్తులు చేసింది. ఎక్కడెక్కడా పార్టీ పట్ల ప్రజల స్పందన మెరుగ్గా ఉ:ది.. ఎక్కడ బలహీనంగా ఉందన్న అంశాలపై ఫోకస్ చేసింది. జగన్ పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఇక్కడే రచించారు.
ప్రత్యేక ఏర్పాట్లు:
పాదయాత్ర కడప జిల్లాలో జరిగినన్ని రోజులు ఉదయమంతా జగన్ వెంటే ఉంటూ రాత్రి కాగానే పీకే టీమ్ అంతా ఆ హోటల్ కు చేరుకునేవారు. వీరి కోసం హోటల్లో 6ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సుమారు నెల రోజుల పాటు పీకే టీమ్ ఇక్కడే బస చేసింది. 13వ తేదీతో కడప జిల్లాలో జగన్ పాదయాత్ర ముగిసి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడంతో కడపలోని హోటల్ ను ఖాళీ చేయడానికి సిద్దమయ్యారు. ఇక్కడే వివాదం మొదలైనట్టు తెలుస్తోంది.
ఎక్కడి నుంచో వచ్చి..:
పీకే టీమ్ మొత్తానికి హోటల్లో రూ.1లక్ష వరకు బిల్లు అయింది. బిల్లు చెల్లించాకే హోటల్ గదులు ఖాళీ చేయాలని యాజమాన్యం చెప్పగా.. ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేస్తామని పీకె టీమ్ చెప్పింది. అందుకు హోటల్ యాజమాన్యం నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. 'ఎక్కడినుంచో వచ్చి మమ్మల్నే బెదిరిస్తారా? ముందు బిల్లు కట్టి కదలండి' అంటూ హోటల్ యాజమాన్యం పీకే టీమ్ ను హెచ్చరించారట.
వైసీపీ నేతల జోక్యంతో:
వాగ్వాదం విషయం పార్టీ నేతలకు తెలియడంతో కొంతమంది వైసీపీ నేతలు రంగంలోకి దిగారట. హోటల్ యాజమాన్యానికి నచ్చజెప్పి పకే టీమ్ ను అక్కడి నుంచి పంపించారట. వైసీపీ నేతల నుంచి భరోసా లభించడంతో హోటల్ యాజమాన్యం అప్పుడు గానీ శాంతించలేదట. కాగా, ఈ హోటల్ కూడా వైసీపీకి చెందిన నేతదనే చెబుతుండటం గమనార్హం.