పుష్కరాల్లో హోటళ్ల బాదుడు! : జేబులకు భారీ చిల్లు తప్పదేమో!
విజయవాడ : కృష్ణా నదిలో భక్తులు మునకేయడం మాటేమో గానీ..! లేనిపోని ఖర్చులతో నిండా మునగడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. 30 శాతం గదులను ప్రభుత్వానికి ఉచితంగా అప్పగించాలన్న సబ్ కలెక్టర్ ఆదేశాలతో.. మిగిలిన గదులపై హోటల్ యాజమాన్యాలు భారీగానే ఛార్జీలు బాదే పరిస్థితి నెలకొంది.
కృష్ణా పుష్కరాల వేళ.. పుష్కరాలకు హాజరయ్యే అతిథుల కోసం, అలాగే ప్రభుత్వ సిబ్బంది అవసరార్థం 30శాతం గదులను ప్రభుత్వానికి ఉచితంగా అప్పగించాలంటూ ఆయా హోటల్ యాజమాన్యాలకు లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు స్థానిక సబ్ కలెక్టర్. దీంతో 30 శాతం గదులను ప్రభుత్వానికి ఉచితంగా వదిలేస్తే.. తమకు మిగిలేదేంటని గగ్గోలు పెడుతోన్న హోటల్ యాజమాన్యాలు గదుల అద్దెను రెట్టింపు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
అంతేకాదు.. ఇప్పటిదాకా అమలులో ఉన్న 24 గంటల టారిఫ్ ను పుష్కరాల సందర్బంగా 12 గంటలకు కుదించేశారు. దీనికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 12 గంటల్లోపే హోటల్ నుంచి ప్యాకప్ చెప్పాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో మరో రోజుకు అద్దె చెల్లించాల్సిందే. మొత్తంగా హోటల్ లో ఏ సమయంలో దిగినా సరే మధ్యాహ్నాం 12గంటలకు గదులు ఖాళీ చేయాలనేది ఈ 12గంటల టారిఫ్ నిబంధన. ఏదేమైనా.. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రం సామాన్యుని జేబుకు భారీ చిల్లు పెట్టేలా తయారైంది.