ఏపీలో ఎల్లుండి నుంచి మరిన్ని సడలింపులు- మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, గుళ్లు...
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్ డౌన్ లో సోమవారం నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు ఏఫీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 8 నుంచి అమల్లోకి వస్తున్న సడలింపుల్లో భాగంగా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, గుళ్లు తెరుచుకోనున్నాయి. అయితే వీటిని తెరిచేందుకు కొన్ని నిబంధనలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవు.
ప్రార్ధనామందిరాల్లోకి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉండాల్సిందే. ప్రవేశమార్గంలో ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. అలాగే భక్తులను కూడా అంతా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా దర్శనానికి పంపించాలి. క్యూలైన్లలోనూ ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. భక్తి గీతాలను ఆలపించడానికి కానీ, తీర్ధ ప్రసాదాలు ఇవ్వడానికి కానీ, పవిత్ర జలాలు చల్లేందుకు కానీ అనుమతి లేదు. భక్తులు విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, నిర్వాహకులపై ఉంటుంది.
Recommended Video
హోటళ్లలోనూ సిబ్బంది గ్లౌసులు, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాల్సిందే. కస్టమర్లు కూర్చునే సీట్లు కూడా దూరం దూరంగా ఏర్పాటు చేయాలి. అలాగే మాల్స్ లో భౌతిక దూరం నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అవసరమైన చోట శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే అధికారులు తిరిగి వాటిని మూయించేస్తారు.