గృహ నిర్బంధాలు, అరెస్ట్ లు .. టీడీపీ , అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడి సాధ్యమేనా ? రాజధానిలో టెన్షన్
రాజధాని అమరావతిలో టెన్షన్ వాతవరణం నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ విపక్షాలు, అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలతో నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు . అసెంబ్లీ, కేబినెట్ సమావేశాలకు నిరసన సెగ తాకే అవకాశం ఉందన్న సమాచారంతో అమరావతి ప్రాంతంలో 5 వేల మంది పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు . ఇంత భద్రత మధ్య అసెంబ్లీ ముట్టడి సాధ్యం కాదు అన్న భావన కలుగుతుంది.
రాజధాని రద్దుకు సర్కార్ రెడీ.. మూడు రాజధానులు , యూపీ మోడల్ లో నాలుగు జోన్లుగా ఏపీ !!
అసెంబ్లీ ముట్టడి సాధ్యమేనా ?
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర విపక్షాల నేతలతో పాటు రైతులకు నోటీసులు అందజేసిన పోలీసులు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక ముఖ్యనాయకుల హౌస్ అరెస్ట్ లు, అరెస్ట్ లతో ఏపీలో అర్దరాత్రి నుండే టెన్షన్ నెలకొంది. ఈ నేపధ్యంలో అసెంబ్లీ ముట్టడి యత్నం విఫలం అవుతుంది అన్న భావన కలుగుతుంది.
అసెంబ్లీ ముట్టడి చేసి తీరతామంటున్న జేఏసీ
మరోపక్క రాజధాని జేఏసీ మాత్రం నిర్బంధాలకు భయపడకుండా ప్రజలంతా చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరించినా, పోలీసులు అరెస్ట్ చేసినా సరే తమ న్యాయమైన డిమాండ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలని అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్తున్నారు. ఉదయం ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరుతామని జేఏసీ నేతలు వెల్లడించారు.
హౌస్ అరెస్ట్ లు, అరెస్ట్ లతో అసెంబ్లీ ముట్టడి యత్నానికి చెక్ పెడుతున్న పోలీసులు
ఉదయం తొమ్మిదిన్నరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తామని తెలిపారు. అరెస్టులకు సిద్ధంగా ఉన్నామని వారంటున్నారు . రైతులు, ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉద్యమంలో పాల్గొనాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇక అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలను, వామపక్ష పార్టీల నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎక్కడా ఆందోళనల జాడ కనిపించకూడదని పోలీసులు అసెంబ్లీ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు . దీంతో అసెంబ్లీ ముట్టడి కష్టమే అన్న భావన తాజా పరిస్థితుల నేపధ్యంలో కలుగుతుంది.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్ష పార్టీలు
వేలాది మంది పోలీసుల మోహరింపు, ఆంక్షలపై టీడీపీతో పాటు వామపక్ష పార్టీలు, అమరావతి జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో కూడా లేని బలగాలను అమరావతిలో మోహరించారని మండిపడుతున్నారు . తప్పు చేస్తున్నారు కాబట్టే ముఖ్యమంత్రి ఇంతగా భయపడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .మరి ఇప్పటికే పలు మార్లు రాజధాని అంశంపై తేల్చేస్తామని మళ్ళీ పొడిగిస్తూ కమిటీలు వేశారు. ఇక ఈ రోజు కూడా తాజా ఉద్రిక్తతల నేపధ్యంలో రాజధానిపై తుది నిర్ణయం వెల్లడిస్తారా ? అన్నది వేచి చూడాలి.
రాజధాని అమరావతిలో హై టెన్షన్
నేడు రాజధాని విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోనున్న నేపధ్యంలో, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది సర్కార్ . ఇక ఇదే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాయి పలు పొలిటికల్ పార్టీలతో పాటు అమరావతి జేఏసీ. ఈ నేపధ్యంలో రాజధానిలో హై టెన్షన్ నెలకొంది.