అమరావతి ఎఫెక్ట్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మళ్లీ బ్రేక్: నెల తరువాతే..నాలుగోసారి వాయిదా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో అత్యంత కీలకమైన సంక్షేమ పథకానికి ఇప్పట్లో మోక్షం లభించేలా కనిపించట్లేదు. ఈ పథకాన్ని అమలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ కొలిక్కి రావట్లేదు. ప్రతీసారీ ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే వస్తోంది. ఫలితంగా తలపెట్టిన ప్రతీసారీ వాయిదా పడుతూ వస్తోందీ ఈ పథకం. తాజాగా మరోసారి కూడా అలాంటి పరిణామమే ఏర్పడింది. ఈ పథకం పంపిణీ మరోసారి వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఇళ్ల స్ధలం కోసం దరఖాస్తు చేసుకోలేదా ? మరో అవకాశం ఇదిగో....15 రోజులే గడువు..
ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు..
ఆ పథకమే- పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ. నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన ఈ ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అమలు మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. నిజానికి- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన అంటే.. బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. దీనికోసం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం ఓ పైలాన్ను కూడా అక్కడ నిర్మితమౌతోంది. ఈ ప్రయత్నాలన్నీ మరోసారి అమలులోకి వచ్చేలా కనిపించట్లేదు.
ఆగస్టు 15కు వాయిదా..
ఈ పథకం వాయిదా పడినట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చేనెల 15వ తేదీన దీన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం- న్యాయపరమైన ఇబ్బందులేనని తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద సేకరించిన కొన్ని భుములు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాయని, వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని తేలడం వల్లే ఈ పథకం అమలును వాయిదా వేశారని అంటున్నారు.
అమరావతి ప్రాంతంలోని భూముల వల్లే..
రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలో ప్రభుత్వం సేకరించిన కొన్ని భూములకు సంబంధించిన కేసులు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయని సమాచారం. అలాంటప్పుడు వాటిని పేదలకు పంచడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, దీనివల్ల మొదటికే మోసం వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు కేసులు ఉన్న భూములను పేదలకు పంచడం సరికాదని, వాటిని పరిష్కరించుకున్న తరువాతే ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో..
మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా ప్రభుత్వం భూమిని సేకరించిన విషయం తెలిసిందే. వాటిని పేదలకు పంచాలనే ఉద్దేశంతో డీనోటిఫై కూడా చేసింది. ప్రస్తుతం ఆ భూముల వల్లే ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయని చెబుతున్నారు. సీఆర్డీఏ పరిధి మొత్తాన్నీ ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఇప్పటికే శాసనసభలో ఓ తీర్మానాన్ని చేసింది. ఇది శాసన మండలిలో పెండింగ్లో ఉంది. సీఆర్డీఏ రద్దు బిల్లును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటీషన్లు దాఖలు అయ్యాయి.
రద్దు బిల్లులోని భూముల సేకరణపై
ఈ పిటీషన్ల ప్రభావం సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వం సేకరించిన భూములపై పడిందని అంటున్నారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల పరిధిలో భూమిని సేకరించడంపై ఆటోమేటిక్గా స్టే ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాని ప్రభావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని, ఇది ఆ భూమిని అందుకున్న పేదలకు న్యాయపరమైన ఇబ్బందులను సృష్టించవచ్చని అంటున్నారు. దీన్ని పరిష్కరించుకున్న తరువాతే ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని సమాచారం.
Recommended Video
నాలుగోసారి వాయిదా..
ఇంతకుముందు- ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం, అది రద్దయినా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వంటి పరిస్థితుల మధ్య అప్పుడు కుదర్లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14వ తేదీన పంపిణీని చేపట్టాలని నిర్ణయించారు. అప్పటికే కరోనా వ్యాప్తి చెందడంతో.. ఏకంగా ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. ఇక మళ్లీ ఆగస్టు 15కు వాయిదా పడినట్టే కనిపిస్తోంది.