ఊహించలేదు.. కానిస్టేబుల్ 'బైక్'ను అడ్డుకోవడంతో వివాహిత దుర్మరణం!
అయితే హఠాత్తుగా అతను బైక్ ను అడ్డుకోవడంతో.. వాహనం అదుపు తప్పి దంపతులిద్దరు కిందపడిపోయారు. వెను వెంటనే వెనుక నుంచి వచ్చిన ఓ లారీ పద్మ తల పైనుంచి వెళ్లింది.
గాజువాక: వాహనదారుల తప్పిదమో.. కానిస్టేబుల్ దుందుడుకు వైఖరే కారణమో తెలియదు గానీ మొత్తానికి ఓ వివాహిత నడిరోడ్డుపై దుర్మరణం పాలైంది. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా హఠాత్తుగా ఓ కానిస్టేబుల్ వాహానాన్ని అడ్డగించడంతో.. అదుపుతప్పిన ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనంపై ఉన్న గృహిణి కింద పడగా.. ఆ వెంటనే ఓ లారీ ఆమె తల పైనుంచి వెళ్లింది. దీంతో అక్కడిక్కడే ఆమె తన ప్రాణాలు వదిలింది.
విశాఖపట్నంలోని అక్కడిరెడ్డిపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. కోరమండల్ గేట్ వద్ద అజంత కాలనీలో నివాసముంటున్న అంగ ఆనంద్, పద్మ దంపతులు శుక్రవారం ఉదయం ఆనందపురంలోని సంతోషిమాత ఆలయానికి బయలుదేరారు.
ఈ క్రమంలో అక్కడిరెడ్డి పాలెం మీద నుంచి వారు ప్రయాణిస్తున్న సమయంలో.. అక్కడే విధుల నిర్వర్థిస్తున్న గాజువాక కానిస్టేబుల్ నాయుడు హఠాత్తుగా వారి బైక్ ను ఆపాడు. హెల్మెట్ వాడకం తప్పనిసరి కావడంతో.. గత కొద్దిరోజులుగా విశాఖలో వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాయుడు బైక్ ను అడ్డుకున్నాడు.
అయితే హఠాత్తుగా అతను బైక్ ను అడ్డుకోవడంతో.. వాహనం అదుపు తప్పి దంపతులిద్దరు కిందపడిపోయారు. వెను వెంటనే వెనుక నుంచి వచ్చిన ఓ లారీ పద్మ తల పైనుంచి వెళ్లింది. దీంతో నడిరోడ్డు పైనే ఆమె దుర్మరణం పాలైంది. పద్మ దుర్మరణానికి కారణం కానిస్టేబుల్ దుందుడుకు వైఖరే కారణమని భావించిన స్థానికులు.. అతన్ని పట్టుకుని చితకబాదారు.
వాహనాలు వేగంగా వెళ్లే జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించడమేంటని కానిస్టేబుల్ ను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి వచ్చి స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు మాత్రం పోలీసుల వాదనను పట్టించుకోలేదు. దీంతో దాదాపు 3గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది.
చివరకు గాజువాక ఏసీపీ రామ్మోహనరావు, నగర ట్రాఫిక్ ఏడీసీపీ కింజరపు ప్రభాకర్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, కానిస్టేబుల్ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్న సమయంలో వారి వద్ద హెల్మెట్ కూడా ఉంది. అయితే ఆనంద్ దాన్ని ధరించకపోవడంతో కానిస్టేబుల్.. బైక్ ను అడ్డుకున్నాడు. ఊహించని రీతిలో విషాదం చోటు చేసుకోవడం పరిస్థితి అదుపు తప్పేలా చేసింది.