బీజేపీ-జనసేన పొత్తు : చంద్రబాబుకే ఎక్కువ డ్యామేజ్? పొత్తులో టీడీపికి ఛాన్స్ లేనట్టేనా?
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల పైనే సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే అందుకోసం గ్రౌండ్ సిద్దం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. గతంలో వామపక్షాలు,బీఎస్పీతో పొత్తులు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో.. ఈసారి ఆయన బీజేపీతో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల వరకు బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 2024లో అధికారంలోకి వచ్చి తీరుతామని బీజేపీతో సమావేశం తర్వాత ధీమా వ్యక్తం చేశారు. తనవి టెస్టు మ్యాచ్ తరహా రాజకీయాలని.. సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలే తప్ప టీ20 తరహా రాజకీయాలు చేయనని గతంలో చెప్పినప్పటికీ.. తాజా రాజకీయ అడుగులు ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొడిసిన కొత్త పొత్తుతో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటివరకు వైసీపీ వర్సెస్ టీడీపీ
ఏపీలో ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీజేపీ,జనసేనలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయాయి. ఆ తర్వాత కూడా రెండు పార్టీలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ.. వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అనిపించుకోవడానికి వాటి శక్తి సరిపోవట్లేదు. కానీ తాజాగా ఈ రెండు పార్టీలు చేతులు కలపడం ద్వారా.. భవిష్యత్తులో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగే అవకాశం లేకపోలేదు.
బీజేపీ-జనసేన రాజకీయ సమీకరణాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులు కావడంతో.. ఆ సామాజికవర్గం వీరి వెనకాల నిలబడే అవకాశం ఉంది. అలాగే జనసేనకు కేడర్ లేని లోటు, బీజేపీకి క్రౌడ్ పుల్లర్ లేని లోటు తీరిపోతుంది. అలాగే బీజేపీ జనసేనకు ఆర్థికంగానూ కలిసొస్తుంది. పార్టీ నిర్వహణ భారాన్ని ఇప్పటివరకు తన భుజాల పైనే మోస్తున్న పవన్ కల్యాణ్కు.. బీజేపీ మద్దతు చాలావరకు దోహదపడుతుంది. గత ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకును పవన్ జనసేన వైపుకు తిప్పుకోలేకపోయినప్పటికీ.. రెండు పార్టీలు కలిసి పనిచేయడం ద్వారా కాపులు గంపగుత్తగా వారి వైపే నిలబడే అవకాశం లేకపోలేదు. బీజేపీకి ప్రస్తుతం ఓసీల్లో ఓటు బ్యాంకు ఉంది. ఇద్దరు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ద్వారా మిగతా సామాజికవర్గాలను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే జనసేన-బీజేపీ పొత్తు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
పొత్తులో టీడీపీకి ఛాన్స్ లేనట్టేనా..
తాజా సమావేశంలో బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్.. ఏపీలో జనసేనతో మాత్రమే కలిసి పనిచేస్తామని, టీడీపీ వైసీపీలతో పొత్తు ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. అదే జరిగితే బీజేపీ-జనసేన పొత్తుతో వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరగా.. భవిష్యత్తులో మరింతమంది ఆ పార్టీలో చేరవచ్చు. వైసీపీ కేసుల భయం వల్లనో లేక రాజకీయ భవిష్యత్తు కోసమో టీడీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ ఆ స్థానాన్ని కోల్పోతుంది. బీజేపీ-జనసేన పొత్తులో టీడీపీకి అవకాశం ఇస్తే.. కన్నా లక్ష్మీనారాయణ,పవన్ కల్యాణ్ ఇద్దరూ చంద్రబాబు జూనియర్లుగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకు వారు అవకాశం ఇవ్వకపోవచ్చు.
అవే సంకేతాలు.. :
బీజేపీలో చంద్రబాబు అనుకూల,వ్యతిరేక వర్గాలు రెండు ఉన్నాయి. తాజాగా జనసేనతో సమావేశం కోసం బీజేపీ తరుపున హాజరైనవాళ్లు చంద్రబాబు వ్యతిరేక వర్గం వారే. కన్నా లక్ష్మీనారాయణ,పురంధేశ్వరి,సోము వీర్రాజు,జీవీఎల్ నరసింహారావు.. వీరంతా చంద్రబాబుకు బద్ద వ్యతిరేకులు. బీజేపీ-జనసేన పొత్తు ప్రతిపాదనలపై చర్చల్లో వీరు క్రియాశీలకంగా వ్యవహరించడం.. ఈ పొత్తులో భవిష్యత్తులో టీడీపీకి స్థానం లేదని చెప్పకనే చెప్పినట్టయింది. దీంతో ఏపీ భవిష్యత్ రాజకీయం వైసీపీ వర్సెస్ బీజేపీ-జనసేనగా మారే అవకాశం ఉంది.