చంద్రబాబులో అభద్రతా భావం, అందుకే..: కొత్తపల్లి సుబ్బారాయుడు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిలో అభద్రతా భావం నెలకొందని, అందుకే పట్టిసీమ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళి అన్నారు. అసలు పనులే ప్రారంభం కాకుండా పట్టిసీమ ప్రాజెక్టుకు ఎలా ప్రారంభోత్సవం చేస్తారని వారు అడిగారు.
పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేయడమంటే పంద్రాగస్టునాడు ప్రజలను మోసం చేయడమేనని వారు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తుగ్లక్ పాలన సాగిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు విదేశీ యాత్రల పేరుతో ప్రజధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారుని, ఆ కారణంగానే ప్రత్యేక హోదా రావడం లేదని వారన్నారు. తాడిపూడి మళ్లింపు పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు అన్యాయం చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు.