అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటేస్తారు అన్న మంత్రి దేవినేని ఉమా
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ నేత దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్ పై మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ చూసి జగన్ సంబర పడుతున్నారని కానీ ఆ సంబరం ఎంతో సేపు నిలవదని ఆయన అన్నారు. జగన్ భ్రమల్లో బతుకుతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు . టీడీపీ తప్పక విజయం సాధిస్తుంది అని వైసీపీకి మరోసారి భంగపాటు తప్పదని దేవినేని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని నూటికి వెయ్యి శాతం గెలుస్తామని ధైర్యంగా చెప్పగలిగింది టీడీపీనే అని దేవినేని ఉమ అన్నారు. చిత్తశుద్ధి లేని జగన్ శివపూజ ఫలించదన్నారు. రాత్రి వరకు క్యూలో నిలబడి ప్రజలు దొంగలకు ఓట్లు వెయ్యరని ఆయన పేర్కొన్నారు . సైలెంట్ ఓటుతో టీడీపీ గెలవబోతోందని దేవినేని ఉమ ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఈ 40 రోజుల్లో వైసీపీ అభ్యర్థులతో మాట్లాడే సాహసం కూడా జగన్ చెయ్యలేదన్నారు. జగన్ కు ప్రజలు ఓట్లు వేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్కు ఏం చూసి ప్రజలు ఓటేస్తారని అడిగారు దేవినేని ఉమా. రాజధాని అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ప్రజలు ఎలా ఓటేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజా తీర్పు టీడీపీ కే అనుకూలం అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ లో టీడీపీ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకి ఓటేసి గెలిపించారని చెప్పారు. చంద్రబాబు అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే నమ్మకంతో ఆయనను సీఎం చేశారని వెల్లడించారు. 2019లో కూడా టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు అనే బాధ్యతతో ప్రజలు ఓటేశారని చెప్పారు. మే 23న ఫలితాలు వచ్చాక తాము సంబరాలు చేసుకుంటామని దేవినేని ఉమ ఆశాభావం వ్యక్తం చేశారు.