వడ్డీ కాసులవాడికే నోట్ల కష్టాలు, స్పందించని రిజర్వ్ బ్యాంకు
రద్దుచేసిన నగదు తో టిటిడి ఇబ్బందులు పడుతోంది. ఈ నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. దరిమిలా ఆర్ బి ఐ కి టిటిడి లేఖ రాసింది.
తిరుమల :రద్దుచేసిన నగదు టిటిడికి కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. రద్దుచేసిన నగదు భారీగా శ్రీవారి హుండీలో జమ అయింది. ఈ నగదును ఎలా మార్పిడి చేసుకోవాలనే విషయమై అర్థం కాక అధికారులు తలలు పట్టుకొంటున్నారు.
పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత నల్లధనం కలిగినవారు ఎక్కువగా దేవాలయాల హుండీల్లో రద్దుచేసిన నగదును జమ చేశారు. ఈ నగదును మార్చుకొనే వీలులేని వారిలో ఎక్కువ మంది ఈ మార్గాన్ని అనుసరించారు.
పెద్ద నగదు నోట్ల మార్పిడి చేసుకొనే అవకాశంతో పాటు., బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకు సమయం కూడ పూర్తైంది. అయితే పెద్ద ఎత్తున దేవాలయాల హుండీల్లో రద్దుచేసిన నగదును జమ అయింది. ఈ నగదును మార్చుకోవడానికి తలలు పట్టుకొంటున్నారు దేవాలయాల యాజమాన్యాలు.
రద్దుచేసుకొన్న నగదు మార్చుకోవడం ఎలా ?
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది. ఈ నగదును రద్దుచేసిన తర్వాత ఎక్కువగా దేవాలయాల హుండీల్లో రద్దుచేసిన నగదు జమ అయింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి హుండీలో ప్రతి రోజు సుమారు 30 నుండి 50 లక్షల రద్దుచేసిన నగదు జమ అయ్యింది. ఈ నగదును జమ చేయకూడదని చెప్పే సాహసాన్ని టిటిడి పాలకవర్గం చేయడం లేదు.దీంతో పెద్ద ఎత్తున టిటిడి వద్ద రద్దుచేసిన నగదు హుండీల్లో ఉండిపోయింది.
గడువు ముగిసింది ఏం చేయాలి
పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేయడానికి గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ గడువు మేరకు బ్యాంకుల్లో రద్దుచేసిన నగదును తీసుకోవడం లేదు. అయితే ఎంపిక చేసిన ఆర్ బి ఐ కేంద్రాల్లో మాత్రమే ఈ నగదును తీసుకొనే పరిస్థితి ఉంది.అయితే కేంద్రం కొత్త ఆర్డినెన్స్ ను తెచ్చింది. పాత నగదును కలిగి ఉన్నవారిపై కేసులు నమోదుచేయనుంది.
టిటిడికి లేఖ కు స్పందించని ఆర్ బి ఐ
తమ దేవాలయం హుండీల్లో రద్దుచేసిన నగదు బారీగా పేరుకుపోయిన విషయమై టిటిడి అధికారులు ఆర్ బి ఐ కి లేఖ రాశారు. ఇప్పటివరకు వచ్చిన కానుకల రూపంలో వచ్చిన పాత నగదును తమ బ్యాంకు ఖాతాల్లో టిటిడి జమ చేసింది.అయితే గత ఏడాది డిసెంబర్ 31వ, తేదిన వచ్చిన పాత నగదును బ్యాంకుల్లో స్వీకరించేందుకు బ్యాంకర్లు నిరాకరించారు. ఈ విషయమై టిటిడికి ఆర్ బి ఐకి లేఖ రాసింది. ఈ లేఖకు ఇంకా టిటిడి నుండి స్పందన రాలేదు.
ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ
రద్దుచేసిన నగదును బ్యాంకులు స్వీకరించని పరిస్థితుల్లో ఎంపిక చేసిన ఆర్ బి ఐ కేంద్రాల్లో మార్పిడి చేసుకొనే అవకాశం ఉంది.అయితే ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ నగదును మార్పిడి చేసేలా ఆర్ బి ఐతో చర్చిస్తే ప్రయోజనం ఉండే అవకాశం ఉందని టిటిడి అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. మరో వైపు ఎంపిక చేసిన ఆర్ బి ఐ కేంద్రాల్లో ఈ నగదును మార్పిడి చేసుకోవడం మార్గం.
భారీగా తగ్గిన హుండీ ఆధాయం
పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత టిటిడి హుండీ ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి రోజు సుమారు 3 కోట్లకు పైగా టిటిడికి హుండీల ద్వారా ఆదాయం వస్తోంది. అయితే ఈ ఆదాయం ఇటీవల తగ్గింది. పెద్ద నగదు నోట్ల రద్దుతో పాటు, ప్రజల వద్ద కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవడం కూడ ఓ కారణమనే అభిప్రాయం కూడ ఉంది.