గ్రీన్ జోన్ విజయనగరం రెడ్ జోన్ అయ్యిందిలా- ఆ రెండు నిర్ణయాల ప్రభావమెంత ?
ఈ ఏడాది మార్చి నెలలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమయ్యాక నిన్న మొన్నటి వరకూ ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పక్కనే విశాఖ జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా, ఢిల్లీ వెళ్లి వచ్చిన కరోనా బాధితులు ఉన్నప్పటికీ జిల్లాకు మాత్రం వైరస్ వ్యాప్తి కాలేదు. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు జిల్లా పాలిట శాపంగా పరిణమించింది.
కరోనా వైరస్ సెక్స్ ద్వారా సంక్రమిస్తుందా..? తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..
విజయనగరం జిల్లాకు కరోనా వచ్చిందిలా...
కరోనా వ్యాప్తి మొదలయ్యాక చాలా రోజుల పాటు సేఫ్ జోన్లో ఉన్న విజయనగరం జిల్లాను ప్రభుత్వం గ్రీన్ జోన్ గా ప్రకటించింది. ఓ దశలో జిల్లాలో బస్సు సర్వీసులతో పాటు అన్ని కార్యకలాపాలను దశల వారీగా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చివరికి రేపటి నుంచి బస్సు సర్వీసులు కూడా ప్రారంభించాలని అధికారులు సిద్ధమైన తరుణంలో చివరి నిమిషంలో వారికి షాకింగ్ వార్త అందింది. విజయనగరంలో తాజా పరిస్దితిపై అమరావతిలో చర్చించిన అధికారులు.. ఎందుకైనా మంచిది బస్సు సర్వీసులు అప్పుడే వద్దని వారించారు. ఇప్పుడు వారి అనుమానమే నిజమైంది. సీన్ కట్ చేస్తే నిన్న మొన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లా తాజాగా మూడు కేసులతో రెడ్ జోన్ లో చేరిపోయింది.
వలస కార్మికులే కారణం...
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం వలస కార్మికులను స్వస్ధలాలకు పంపుతోంది. ఇలా తమ స్వస్ధలమైన విజయనగరానికి వచ్చిన ముగ్గురు వలస కార్మికులకు పరీక్షిస్తే కరోనా ఉందని తేలింది. దీంతో వీరిని ఆస్పత్రులకు పంపి చికిత్స అందిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుతో జిల్లాకు వచ్చిన వలస కార్మికుల్లో ముగ్గురికి కరోనా ఉందని నిర్ధారణ కావడంతో అధికారులు ఇప్పుడు మిగతా వారిని కూడా ఒకటికి రెండుసార్లు పరీక్షించేందుకు సిద్దమవుతున్నారు. వీరంతా కలిసి ప్రయాణం చేసి రావడంతో వైరస్ ఎవరెవరికి వ్యాప్తి చెందిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పొరబాటున లాక్ తెరిచి ఉంటే...
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా గ్రీన్ జోన్లో ఉన్న విజయనగరం జిల్లాలో బస్సులు నడపటంతో పాటు పలు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు తాజాగా నమోదైన మూడు కేసులతో జనం ఉలిక్కిపడ్డారు. అధికారుల పరిస్ధితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. ప్రభుత్వ వెసులుబాటుతో లాక్ డౌన్ సడలింపు ఇచ్చి బస్సులు తిప్పితే ఇప్పటికి వైరస్ చాలా మందికి వ్యాప్తి చెంది ఉండేదని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు జిల్లాకు వైరస్ వ్యాప్తి బెడద తప్పిందని వారు ఊపిరిపీల్చుకుంటున్నారు.