వైసీపీకి పనికిరాని ఇన్ సైడర్ ట్రేడింగ్- టీడీపీకి ఆయుదంగా మారిందిలా - అమరావతికి కౌంటర్...
అమరావతి రాజధాని ఎంపికకు ముందే అక్కడ భూముల కొనుగోలు ద్వారా అప్పటి అధికార టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వస్తోంది. ఇదే అంశంపై సీబీఐతో పాటు ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఈ వ్యవహారంలో ఏమీ తేలకపోవడంతో వైసీపీ ప్రభుత్వం దీన్నో ప్రచారంగా వాడుకుంటోందనే ఆరోపణలు వచ్చాయి.
అమరావతి భూ కుంభకోణంపై సీఐడీ దూకుడు: సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ... తమకు అనుకూలమైన అమరావతి ప్రాంతంలోనే రాజదాని వస్తుందని పార్టీ నేతలకు, సన్నిహితులకు లీకులు ఇచ్చి ఆ తర్వాత రాజధాని ప్రకటన చేసిందనేది ఎప్పటినుంచో వైసీపీ ఆరోపణ. ఇందులో రాజధాని గురించి ముందే తెలిసిన టీడీపీ నేతలు అక్కడ భూములు కొని రాజధాని రాకతో భారీగా లబ్ది పొందారని, దీన్నే ఇన్ సైడర్ ట్రేడింగ్ గా పేర్కొంటోంది వైసీపీ. కానీ ఈ ఆరోపణలు చట్టపరంగా నిరూపించే అవకాశం లేకపోవడంతో ఇప్పటికీ ఇవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి.. సీబీఐ విచారణ ప్రారంభమైనా దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేని పరిస్ధితి.
టీడీపీకి ఆయుధంగా మారిందిలా....
ఏపీలో గతేడాది అధికారం చేపట్టాక 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భూసేకరణ చేపట్టింది. అయితే భూముల లభ్యత తక్కువగా ఉండటంతో ప్రైవేటు భూములు సేకరించాల్సి వచ్చింది. ఇదే అదనుగా కొందరు వైసీపీ నేతలు పేదల భూములను కారు చౌకగా కొట్టిసి తిరిగి వాటినే ప్రభుత్వానికి అమ్మేశారని తాజాగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్నే ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ గా పేర్కొంటూ విపక్ష టీడీపీ ఆరోపణలు మొదలుపెట్టింది. సరిగ్గా వైసీపీ ప్రభుత్వం కనిపెట్టిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పదాన్నే పేదల భూముల విషయంలో వారికే వర్తింపజేస్తూ టీడీపీ చేస్తున్న విమర్శలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వైసీపీకి పనికిరానిది టీడీపీకి పనికొస్తుందా ?
గతంలో అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడటం ద్వారా టీడీపీ నేతలు భారీగా లబ్ధిపొందారన్న ఆరోపణలు చేసిన వైసీపీ వాటిని నిరూపించడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ఇవి కేవలం రాజకీయ ప్రచారం కోసం చేసిన ఆరోపణలుగానే మిగిలిపోయాయి. పైగా ఇవే ఆరోపణలతో రాజధాని మార్పుకు సిద్ధమైన వైసీపీ ఈ ప్రాంతంలో విలన్ గా మారిపోయింది. సరిగ్గా ఇలాంటి ఆరోపణలతోనే పేదల ఇళ్లస్ధలాల విషయంలో వైసీపీ సర్కారును ఇబ్బందిపెట్టాలని భావిస్తున్న టీడీపీ సక్సెక్ అవుతుందా అనే చర్చ మొదలైంది.
Recommended Video
రాజకీయంగా ప్రయోజనం....
పేదల ఇళ్ళ స్ధలాల విషయంలో వైసీపీ సర్కారు, నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు టీడీపీ చేస్తున్న ఆరోపణలను అమరావతి తరహాలోనే నిరూపించడం అసాధ్యం. కానీ టీడీపీ మాత్రం వీటిని హైలెట్ చేయడం ద్వారా వైసీపీకి ఇళ్ల స్ధలాల పంపిణీ ద్వారా వచ్చే రాజకీయ ప్రయోజనాన్ని దూరం చేయడంతో పాటు ఇళ్ళు రాని వారికి ఇన్ సైడర్ ట్రేడింగే కారణమన్న సంకేతాలు పంపడమే లక్ష్యంగా టీడీపీ ముందుకెళుతోంది. తద్వారా ఆరోపణలు నిరూపితమైనా, కాకపోయినా రాజకీయ ప్రయోజనం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రచారాన్ని మరింత తీవ్రతరం చేయడం ద్వారా అమరావతి విషయంలో వైసీపీ వైఖరికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.