'రూ.500, రూ.వెయ్యి నోటుకు రూ.2వేల నోటుకు తేడా లేదు', 'ప్రధానిగా మోడీ పనికి రారు'
ప్రత్యామ్నాయం చూపకుండా పాత నోట్ల రద్దను ప్రధాని మోడీ అనాలోచితంగా ప్రకటించారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు.
అనంతపురం/హైదరాబాద్: ప్రత్యామ్నాయం చూపకుండా పాత నోట్ల రద్దను ప్రధాని మోడీ అనాలోచితంగా ప్రకటించారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడలేదన్నారు. రూ.14 లక్షల కోట్ల రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారన్నారు. కొత్తగా ఎన్ని విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో మీరు చెప్పిన లక్ష్యం నెరవేరిందా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీవి రావని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. కొత్తగా చెలామణిలోకి తెచ్చిన రూ.2వేల నోటు చెల్లని రూ.500, రూ.1000తో సమానమన్నారు. రూ.2వేల నోటు సామాన్యులకు ఉపయోగపడటం లేదన్నారు. చిల్లర దొరకడం లేదని, దాచుకోవడానికే పనికొస్తుందన్నారు.
ప్రధానిపై సిపిఐ నారాయణ ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోడీ పైన సీపీఐ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఆయన హైదరాబాదులోని ఆర్బీఐ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రధాన మంత్రిగా మోడీ పనికి రారన్నారు.
కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్బీఐ గవర్నర్ సంతకం పెట్టిన నోట్లు చెల్లవని మోడీ అనడం దుర్మార్గమన్నారు. పాత నోట్ల రద్దు ప్రజల పైన కేంద్రం చేసిన దాడి అన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నోట్ల రద్దు సరికాదన్నారు. నోట్ల రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. విదేశాల నుంచి వెంటనే నల్లధనాన్ని తెప్పించాలన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా నోట్ల రద్దు ఎలా చేస్తారని నిలదీశారు.