జగన్కు అన్ని ఆస్తులు ఎక్కడివి: పల్లె అనుమానం, చంద్రబాబు ఆకస్మిక తనిఖీ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు ప్రశ్నించారు. నల్లధనం పైన ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లధనంపై మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించారే తప్ప ఎవరి పేరు ప్రస్తావించలేదని గుర్తు చేశారు. దేశంలోనే అత్యధికంగా పన్ను కడుతున్న వారి జాబితాలో జగన్ మూడో స్థానంలో ఉన్నారని చెప్పారు.
ఆయనకు అంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. టాటా, బిర్లాల మాదిరిగా జగన్ ఏ వ్యాపారం చేయలేదన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్లు దోచుకున్నాడని ధ్వజమెత్తారు.
బ్లాక్ మనీని అరికట్టాలని ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే రూ.10వేల కోట్ల వివరాలు ఎలా తెలిశాయని జగన్ బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రస్ ఆల్ ఖైమా మాజీ అధిపతిని అరెస్టు చేసిన నేపథ్యంలో జగన్ను కూడా విచారించాలని ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతిలో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమల నుంచి అలిపిరి చెరుకున్న ఆయనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలకు రుణ సహయం చేసినందుకు టిడిపి నగర మహిళా విభాగం సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ను సీఎం కట్ చేశారు.
మహిళా నేతలు ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. అనంతరం నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో సీఎం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికివాడలను తొలగించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామన్నారు. స్ధలాలు ఉన్నవారికి బహుళ అంతస్తుల భవనాల్లో శాశ్వత ఇళ్లు ఇస్తామన్నారు.
స్ధలాలు లేని వారికి బయట ప్రాంతాలలో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తాగునీరు సరిగా రాలేదంటూ స్కావెంజర్స్ కాలనీ వాసులు సీఎంకు ఫిర్యాదు చేయగా.. మురికివాడల్లో పారిశుద్ద్యం, తాగునీరు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకొవాలని అధికారులను అదేశించారు.
స్కావెంజర్స్ కాలనీ నుంచి జీవకోన వైపు వెళ్తూ తుడా కార్యాలయం రోడ్డులో మురికికాలువలను పరిశీలించారు. చెత్తతో మురికి కాలువ పేరుకు పోవడంతో నగరపాలిక అధికారుల పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి రాజీవ్ కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.