బెజవాడ రాజకీయ వారసుల సత్తా ఎంత.? ప్రజాబలం పొందడంలో విఫలమయ్యారని ఆరోపణలు..!!
అమరావతి/ హైదరాబాద్ : బెజవాడలో రాజకీయ వారసుల ఛరిష్మా మసకబారుతున్నట్టు కనిపిస్తోంది. క్రిష్ణ జిల్లా రాజకీయాలను తమ కను సన్నల్లో శాశించిన ఆ రెండు కుటుంబాల వారసులు అంతే స్థాయిలో ప్రజాభిమానం చూరగొనడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెజవాడ రాజకీయాల్లో వంగవీటి, దేవినేని వారసులు తండ్రికి తగిన తనయులుగా ఎదగలేకపోయారు. ఈ వారసులకు రాబోవు ఎన్నికలు సవాల్గా మారాయి. తండ్రుల ఇమేజ్ను కాపాడటంలో అభిమానులు ఆశించినంత స్థాయికి చేరలేకపోయారు. ఇప్పుడు కనీసం ఎన్నికల్లో గెలిచి, అభిమానుల కోరిక తీర్చుతారా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరిలో ఒకరు దేవినేని నెహ్రు తనయుడు అవినాష్. మరొకరు వంగవీటి మోహనరంగా కుమారుడు రాధాకృష్ణ.
తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొలగించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!
క్రిష్ణా జిల్లా రాజకీయ వారసుల ప్రజా బలం ఎంత..! రాబోవు ఎన్నికల్లో గెలుస్తారా..?
వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా ? జనసేనలోకి కాలుపెడతారా ? లేక ఇండిపెండెంట్గా సత్తాచాటుతారా ? ఏమైనా రాధా రాజకీయ జీవితం సందిగ్ధంలో పడిపోయింది. వైసీపీ నుంచి బయటకు వచ్చి పెద్దతప్పు చేశాడంటూ ఓ వర్గం. ఇప్పటికే ఆలస్యం చేశాడని, గౌతంరెడ్డి తన తండ్రిని విమర్శించినపుడే బయటకు వచ్చి ఉండాల్సిందని మరికొందరు ఇలా ఎవరికి వారు రాధా రాజకీయ నిర్ణయంపై చర్చించుకుంటున్నారు.
ఇంకా ప్లాట్ ఫాం కోసం చూస్తున్న రాధా..! ఏ పార్టీలో చేరతరనేది ఇంకా సందిగ్దమే..!!
వైసీపీ రాజీనామాతో రాధా టీడీపీ వైపు వెళ్తాడని అంచనా వేశారు. ఈ మేరకు కళావెంకట్రావు, బోండా ఉమా వంటి సీనియర్లతో మంతనాలు దీనికి మరింత బలాన్నిచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఏమైందో ఏమోగానీ, తాను టీడీపీలో రమ్మని ఆహ్వానాన్ని కాదన్నందుకు క్షమించాలంటూ నర్మగర్బంగా తప్పుకున్నారు. ఇది జరిగి రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికీ రాధా తన నిర్ణయం ప్రకటించలేదు. బెజవాడలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదోఒక చోట నుంచి పోటీ చేయటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. దేవినేని నెహ్రు తనయుడు అవినాష్ గత ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. విజయవాడ ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న రాష్ట్ర విభజన ఆగ్రహంలో ఉన్న ఏపి ప్రజలు ఆయనను ఓడించారు.
టీడిపి అండ ఉన్నా సత్తా చూపలేక పోతున్న అవినాష్..! నియోజక వర్గంపై ఇంకా అయోమయం..!!
పైగా తండ్రికి తగినంత రాజకీయం, పరిణితి ప్రదర్శించలేకపోతున్నాడనే అపవాదు లేకపోలేదు. తండ్రిచాటున పెరిగిన అవినాష్ కోటరీ దాటి బయటకు రాలేకపోయాడు. అందరినీ కలుపుకో గల సమర్థతపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. గత ఏడాది తండ్రి నెహ్రు మరణించటంతో అవినాష్ కు రాజకీయంగా దిశానిర్దేశం చేసే వారు లేరనే చెప్పాలి. దేవినేని ఉమా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎంత వరకూ అండగా ఉంటాడనేది ప్రశ్నార్ధకమే. నెహ్రు మరణించినపుడు చంద్రబాబు తానే కుటుంబ పెద్దగా వ్యవహరించి అవినాష్ బాధ్యతలు స్వీకరిస్తానంటూ హామీనిచ్చారు.
ప్రజాధరణ ఉంటే గెలుపు..! లేకపోతే వ్యక్తిగత విపలమే..!!
దీనిలో భాగంగానే ఈ సారి అవినాష్ను ఎలాగైనా గెలిపించి అసెంబ్లీకు పంపాలని భావిస్తున్నారు. అయితే.. కంకిపాడు, గుడివాడ, విజయవాడ ఇలా అవినాష్ ను సరైన నియోజకవర్గ ఎంపికలో టీడీపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. క్రిష్ణా జిల్లా వారసుల్లో ఒకరు అండ కోసం ఎదరుచూస్తుంటే, మరొకరు అండతో అందలం ఎక్కాలనుకుంటున్నారు. మరి.. వీరిలో ఎవరు నెగ్గగలరు ? ఎవరు తండ్రికి తగిన వారసులుగా నిలదొక్కుకోగలరనేది ఎన్నికల్లో ప్రజా నిర్ణయమే నిర్ధారణ చేయాలి.