ఎంత దౌర్భాగ్యం: బ్లేడుతో గర్భాన్ని చీల్చుకుని పసికందును బయటికి తీసుకున్న గిరిజన మహిళ
ఓ గిరిజన మహిళ పురుటి నొప్పులు భరించలేక గత్యంతరం లేని పరిస్థితిలో బ్లేడుతో స్వయంగా తన గర్భాన్ని చీల్చుకుని బిడ్డను బయటికి తీసుకున్న దారుణ ఉదంతమిది.
కాకినాడ: ప్రసవం కోసం బయలుదేరిన ఓ గిరిజన మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక, మరోవైపు పురుటి నొప్పులు భరించలేక గత్యంతరం లేని పరిస్థితిలో బ్లేడుతో స్వయంగా తన గర్భాన్ని చీల్చుకుని బిడ్డను బయటికి తీసుకున్న దారుణ ఉదంతమిది.
ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన ఏజెన్సీ ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండంలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కింటుకూరు గ్రామానికి చెందిన కె.లక్ష్మి(౩౦) కి పురిటినొప్పులు వచ్చే సూచనలు కనిపించడంతో ఈనెల 23న ఆమె భర్త సీతన్న దొర భార్యను తీసుకుని అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరాడు.
దంపతులిద్దరూ కాలినడకన వెళ్తుండగా మార్గం మధ్యలో లక్ష్మికి పురిటినొప్పులు అధికమయ్యాయి. ఆసుపత్రికి చేరేలోగానే నొప్పులు భరించలేని స్థాయికి చేరుకోవడంతో గత్యంతరం లేని స్థితిలో లక్ష్మి బ్లేడుతో తన గర్భాన్ని చీల్చుకుని బిడ్డను బయటికి తీసుకుంది. అనంతరం ఈ విషయాన్ని ఆమె భర్త సీతన్న దొర స్థానికుల సాయంతో 108 అంబులెన్స్ సర్వీసుకు తెలపడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి అంబులెన్స్ సిబ్బంది చేరుకొని ఆమెను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు.
లక్ష్మికి ఇది ఐదో కాన్పు కాగా, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, ఆసుపత్రిలో ఆమెకు మెరుగైన ప్రసూతి సేవలు అందించామని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి అధికారి డాక్టర్ గౌతం జోగి తెలిపారు. ప్రసవ తేదీకి పది రోజుల ముందే వచ్చి ఆసుపత్రిలో చేరాలని తాము ఎంతగా చెబుతున్నప్పటికీ కొంతమంది గిరిజన మహిళలు పట్టించుకోవడంతో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఉదంతంలో స్థానిక ఆరోగ్య కార్యకర్త నిర్లక్ష్యాన్ని స్థానికులు ఎండగడుతున్నారు. లక్ష్మిని సకాలంలో ఆసుపత్రికి గనుక చేర్చి ఉంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చేది కాదని వారు మండిపడుతున్నారు.
ఈ ఉదంతంపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.చంద్రయ్య స్పందిస్తూ.. ఏజెన్సీలోని గిరిజన మహిళలకు ఇలాంటి ఘటనలు సాధారణమేనని, వారిలో చైతన్యం పెంపొందించాల్సిందిగా ఆరోగ్య కార్యకర్తలకు తాము తగిన సూచనలు ఇస్తున్నామని, లక్ష్మి ప్రసవ ఉదంతంపై విచారణ జరిపిస్తామని తెలిపారు.