ఇదీ గాలి జనార్ధన్ రెడ్డి ధన బలం: కొన్ని షాకింగ్ నిజాలు!
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మిణి వెడ్డింగ్ కార్డుతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గతంలో మైనింగ్ అక్రమాలతో జైలుకెళ్లిన గాలి జనార్దన్, ఇప్పుడు తన కూతురు పెళ్లిన వచ్చే నెలలో అంగరంగ వైభవంగా చేయనున్నారు.
వెడ్డింగ్ కార్డు ద్వారానే ఆయన ఏ స్థాయిలో పెళ్లి చేయాలనుకుంటున్నారో తెలిసిపోయింది. కూతురు వెడ్డింగ్ కార్డు అందర్నీ ఎంత విస్మయానికి గురి చేసిందో, అలాగే చాలామంది విమర్శించేందుకు అవకాశమిచ్చింది. వెడ్డింగ్ కార్డు ద్వారా గాలి జనార్ధన్ తన ధన బలాన్ని నిరూపించుకున్నారని చెబుతున్నారు.
వెడ్డింగ్ కార్డుతో షాకిచ్చిన గాలి జనార్ధన్: ఆ డబ్బెక్కడిదో ఒక్కమాటలో..!
గతంలోను అతను తన ధనబలాన్ని ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు. మైనింగ్ వల్ల పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకున్న గాలి ఇంటికి అధికారులు సోదాలకు వచ్చినప్పుడు అతను బంగారు కుర్చీ పైన కూర్చున్నారు. ఇంట్లో దేవుడి పూజా సామాగ్రి వెండి, బంగారంతో చేసినవి కనిపించాయి.
గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించాడు. బెయిల్ పైన గత ఏడాది బయటకు వచ్చాడు. కాగా, గాలి జనార్ధన్ రెడ్డి గురించి పచ్చి నిజాలు అంటూ.. ప్రముఖ దినపత్రిక పలు అంశాలను వెల్లడించింది.
సౌమ్యంగా మాట్లాడుతూ, వినయాన్ని ప్రదర్శిస్తూ కనిపించే గాలి జనార్ధన్, సన్నిహితుల వద్ద తనను తాను విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయతో పోల్చుకునే వారని వినికిడి అని పేర్కొంది. సీబీఐ దాడులతో అతని అక్రమ సంపాదన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మూడు విలాసవంతమైన భవనాలున్నట్లు సీబీ దాడుల్లో తేలింది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, 70ఎంఎం స్క్రీన్, మసాజ్ పార్లర్, బార్, హోమ్ థియేటర్ ఇలా సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన భవంతులు గాలి సొంతం. చుట్టూ దాదాపు అరకిలో మీటరు మేర భద్రతను పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలు ఉండేవి.
బంగారు కంచాలు, గిన్నెలు, స్పూన్స్, ఫోర్క్స్, కప్పులు, కుండలు, చివరికి లైటర్స్, సిగరెట్ను పొడిని విదిల్చే యాష్ ట్రేలు కూడా గాలి ఇంట్లో బంగారంతో తయారు చేసినవే సీబీఐ దాడుల్లో వెలుగు చూశాయి. వీటన్నింటిని తూకం వేస్తే దాదాపు 30 కేజీలకు పైగానే తూగాయి. అంతేకాదు, రూ.3 కోట్లతో నింపిన సంచులను స్వాధీనం చేసుకున్నారు.
ఐదేళ్ల క్రితం సిబిఐ దాడుల సమయంలో అతనింట్లో సింహాసనం కూడా దొరికింది. 15 కిలోల బరువున్న ఈ సింహాసనాన్ని బంగారంతో తయారు చేశారు. రూ.2.2 కోట్ల విలువైన వజ్రాలతో ఈ సింహాసనాన్ని పొదిగారు. హంపిలో జరిగిన ఓ వేడుకలో గాలి ఈ సింహాసనాన్ని అధిష్టించారు.
గాలి వద్ద ఉన్న కార్లు... రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, లాండ్ రోవర్, బెంజ్, ఆడి, బీఎమ్డబ్ల్యూ. వీటితో పాటు పన్నెండు స్కార్పియోలు, బొలొరోలు, ఒక విలాసవంతమైన బస్సు ఉన్నాయి. కార్లలో వెళ్లడం ఇష్టం లేకపోతే బెల్ హెలికాఫ్టర్లో ప్రయాణించేవారు. రుక్మిణి అని దానికి ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు. ఇంటికి కుడి పక్కనే హెలిప్యాడ్ ఉంది.
గాలి జనార్ధన్ బంగారంతో తయారైన దుస్తులను మాత్రమే ధరించావారని తెలుస్తోంది. ఆయన ఒక చొక్కా ఖరీదు కనీసం రూ.లక్ష ఉంటుందనే వాదనలు ఉన్నాయి. ఆయన ధరించే బెల్ట్ బంగారంతో తయారు చేసింది. దాని విలువ 13లక్షలు. అతను వాడే ఫోన్ బ్లాక్బెర్రీ. గోల్డ్ ప్లేటెడ్తో దాని రూపును మార్చేశారు.
బంగారంతో తయారుచేసిన ఒక అడుగు ఎత్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆరు అంగుళాల పద్మావతి దేవీ విగ్రహం గాలి ఇంట్లోని పూజ గదిలో ఉన్నాయి. ఇంకా పలు దేవతామూర్తుల విగ్రహాలు లభించాయి. వాటి విలువ 2.3 కోట్లు. అంతేకాదు, పూజ గదిలో మోగించే గంట కూడా కిలో బంగారంతో తయారు చేసింది.
2007 నుంచి 2010 మధ్య కాలంలో గాలి సంపద అమాంతం పెరిగింది. దీనికి కారణం అక్రమంగా 29.8 మిలియన్ల ఇనుమును ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే. ఆ ఇనుము విలువ రూ.12,228 కోట్లు. చైనా, బ్రెజిల్, సింగపూర్, హాంగ్కాంగ్ దేశాలకు ఈ ఐరన్ను తరలించేవారు.
ఈ ఒప్పందాల వల్ల గాలి సోదరులు కూడబెట్టిన సొమ్ము ఐదు వేల కోట్లు. ఆ సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి ఒక్క రోజు సంపాదన 5 కోట్ల రూపాయలు. అయితే, గాలి జనార్ధన్ రెడ్డి జైలు పాలు కావడానికి మైనింగ్ కోసం అతను కొల్లగొట్టిన దేవత సుంకలమ్మ తల్లి శాపం తగలడమేనని స్థానికులు భావిస్తుంటారు.
2006లో ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ అక్రమంగా ఈ గుడిని తొలగించింది. అనంతపురానికి, బళ్లారికి సరిహద్దులో ఈ దేవాలయం ఉంది. స్వప్రయోజనాల కోసం ఈ గుడిని గాలి కూలగొట్టారని, అందుకే కష్టాల పాలయ్యారని అంటారు.