తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఎలా: చంద్రబాబును జగన్ ఎలా ఫిక్స్ చేశారు?
హైదరాబాద్: చట్టప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనేది ఉంది. కానీ, తమిళనాడులో దేశంలో ఎక్కడా లేని విధంగా 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు ఆ తరహాలో కల్పించాలనే డిమాండ్ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తెచ్చారు.
కాపులను బీసీల్లో చేర్చాలనే ఆలోచనను బీసీలు వ్యతిరేకిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఈ స్థితిలో కాపులకు రిజర్వేషన్లు ఎలా కల్పించాలనే విషయాన్ని అధ్యయనం చేయడానికి చంద్రబాబు మంజునాథ్ కమిషన్ వేశారు. అయితే, కమిషన్కు మార్గదర్శకాలు ఇవ్వకుండా ఎలా అని జగన్ అడుగుతన్నారు.
తమిళనాడులో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్న విధానం ఉండగా ఇంకా మీనమేషాలు లెక్కబెట్టడం ఎందుకనేది జగన్ ప్రశ్న. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల కోటాను పెంచుకుని కాపులకు రిజర్వేషన్లు కల్పించవచ్చునని ఆయన వాదిస్తున్నారు.
తమిళనాడులో 1969లో ఎన్ సత్తనాథన్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటైంది. 1971లో డిఎంకె ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 31 శాతానికి పెంచింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 16 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. దాంతో మొత్తం రిజర్వేషన్లు 49 శాతం అయ్యాయి.
ఆ తర్వాత ఎంజి రామచంద్రన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 31 శాతం నుంచి 50 శాతానికి పెచింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం మార్పు చేయలేదు. దాంతో రిజర్వేషన్ల శాతం 69కి పెరిగింది. రిజర్వేషన్ల శాతం యాభైకి మించి ఉండకూడదని 1992లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో వెనుకబడిత తరగతల కమిషన్ రెండోది 1993లో ఏర్పాటైంది.
1993లో తమిళనాడు ప్రభుత్వం చట్టాన్ని చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్పించింది. 201లో సుప్రీంకోర్టు సంబంధిత కమ్యూనిటీలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు 50 శాతానికి మించవచ్చునని నోటిపై చేసింది. దీంతో తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
బీసీలకు 30 శాతం, ఎంబిసిలకు 20 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు ఒక శాతం రిజర్వేషన్లు తమిళనాడులో అమలవుతున్నాయి. 30 శాతం బీసీ రిజర్వేషన్లలో బీసీ జనరల్కు 26.5 శాతం, బీసీ ముస్లింలకు 3.5 శాతం కేటాయించారు. ఎస్సీ రిజర్వేషన్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్సీ అరుంధతతైర్లకు 3 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించి 69 శాతం రిజర్వేషన్లను చట్టబద్దం చేసింది. బీసీలతో గొడవ లేకుండా కాపులకు రిజర్వేషన్లను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే పద్ధతి పాటించవచ్చుననేది జగన్ వాదన.
పైగా, చంద్రబాబుకు అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి కాపులకు చట్టబద్దంగా రిజర్వేషన్లు కల్పించడానికి వీలవుతుందని జగన్ అన్నారు. యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని అధిగమించడానికి దాన్ని వాడుకోవాలని ఆయన సూచిస్తున్నారు. జగన్ అడుగుతున్న పద్ధతిలోనే ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నారు.
కాపు రిజర్వేషన్ల కథ...
కాపులకు 1910 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి. 1956 వరకు కాపులు బీసీ జాబితాలోనే ఉన్నారు. 1953లో తొలి బీసీ కమిషన్ ఖలేల్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా కాపులు బీసీల కిందనే ఉన్నారు. ఆ తర్వాత 1956లో కాపులను బీసీ జాబితా నుంచి తొలగించారు.