ఆ లక్షల మందికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి: చిరు
న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లక్షలాది మంది ఉన్నారని వారికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి గురువారం కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీని ప్రశ్నించారు! కేంద్రమంత్రులు జెడి శీలం, చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావులు పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చిరు సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని మొయిలీని ప్రశ్నించారు. హైదరాబాదులో లక్షలాది మంది సీమాంధ్రులు ఉన్నారని, విభజన జరిగితే వారికందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, విద్య, ఉద్యోగ అవకాశాలలో సమస్యలు వస్తాయని చెప్పారు.
విభజన చేసే ముందు వారికి, సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని చిరు అడిగారు. దానికి స్పందించిన మొయిలీ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగాకే ముందుకు వెళ్తామని చిరుతో చెప్పారు.
కాగా, అంతకుముందు మరో కేంద్రమంత్రి జెడి శీలం హైదరాబాదు తప్ప తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. అలాంటి హైదరాబాదు అందరిదీ అన్నారు. హైదరాబాదు ఏ ఒక్కరిదీ కాదన్నారు. సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలను తాము మొయిలీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తమకు సూచించారన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా కలిసుందామన్నారు.