ఏ లెక్కన కేసీఆర్కి జగన్ మద్దతు: తెలిసిందని అచ్చన్న, అలాకాదని అంబటి ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోపాయికారి ఒప్పందాలు బయటపడ్డాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్, తెలంగాణలో తెరాసతో వైసీపీ కలిసి వెళ్తోందన్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలను తెలుగు ప్రజలు ఎప్పటికి అప్పుడు గమనిస్తున్నారన్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేదన్నారు. ఏపీ కోసం జగన్ ఎక్కడా ఏ అంశం ప్రస్తావించిన సందర్భం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల ఘనత చంద్రబాబుదే అన్నారు.
కాగా, తెలంగాణలో వైసీపీ తరఫున గత ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఇద్దరు తెరాసలో చరారు. మరో ఎమ్మెల్యే మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్న పార్టీకే మద్దతు ఎలా ఇస్తున్నారని, ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేకుండానే ఇదంతా జరుగుతోందా అని ప్రశ్నిస్తున్నారు.
తెరాసపై అంబటి వాదన
శాసన మండలి ఎన్నికల్లో తెరాసకు మద్దతు తాత్కాలికమేనని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. తెరాసకు మద్దతు పలికినంత మాత్రాన ఆ పార్టీతో ములాకత్ అయినట్లు కాదన్నారు. తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెరాసపై పోరు చేస్తామన్నారు.
విశ్వాసం గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మహానాడు వేదికగా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో పచ్చని భూములను చంద్రబాబు రాక్షసుడిగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ చర్యలను అడ్డుకుంటామన్నారు.
చంద్రబాబు చెప్పిన గొర్రె కథ ఓసారి ఆయనకు అన్వయించికుంటే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఏ పార్టీలో పెరిగారు, ఏ పార్టీలో మంత్రిగా చేశారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఏపీలో ఓ మాట, తెలంగాణలో మరో పాట పాడుతున్నారన్నారు.