అటకెక్కిన విశాఖ రైల్వే జోన్ - మళ్లీ జగన్, చంద్రబాబు మౌనం- నోరెత్తితే జరిగేది ఇదే...?
విశాఖ రైల్వే జోన్ ను కేంద్రం విజయవంతంగా అటకెక్కించేసింది. దేశంలో కొత్తగా రైల్వే జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదని నిన్న పార్లమెంటులో క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ప్రత్యేక హోదా తరహాలోనే ఏపీకి గతంలో కేంద్రం ఇచ్చిన మరో కీలకమైన హామీ అధ్యాయం ముగిసిపోనుంది. అయినా ఏపీలో రాజకీయ పార్టీలకు చీమ కుట్టినట్లు అయినా లేదు. విశాఖకు స్ధానిక ఎంపీ అయిన అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతి మాత్రం ఇవాళ లోక్ సభలో దీన్ని ప్రస్తావించి ఊరుకున్నారు. జగన్, చంద్రబాబు మౌనం సరేసరి. దీంతో ఏపీకి ఇక ఏదీ రాదని వీరిద్దరూ డిసైడ్ అయిపోయారా అన్న చర్చ జరుగుతోంది.
అటకెక్కిన విశాఖ రైల్వే జోన్
ఏపీకి విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన ప్రధాన హామీల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కూడా ఒకటి. దక్షిణ మధ్య రైల్వే జోన్, తూర్పు కోస్తా రైల్వే జోన్ ను చీల్చి మధ్యలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్వాటు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. దీని సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నట్లు ఇన్నాళ్లూ నమ్మబలికిన కేంద్రం ఇప్పుడు పూర్తిగా మాట మార్చేసింది. విశాఖకు రైల్వే జోన్ ను పరోక్షంగా నిరాకరిచింది. దేశంలో కొత్తగా రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని తేల్చిచెప్పేసింది. దీంతో విశాఖ రైల్వే జోన్ అంశం మరుగున పడిపోయేలా కనిపిస్తోంది.
నోరెత్తని జగన్, చంద్రబాబు
విశాఖకు కేంద్రం గతంలో ప్రకటించిన రైల్వే జోన్ ను ఇచ్చే ఉద్దేశం లేదంటూ పరోక్షంగా కేంద్రం చెప్పేసిన నేపథ్యంలో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు దీనిపై పోరాటం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ప్రకటన చేసి 24 గంటలు గడిచిపోయినా అటు జగన్ కానీ, ఇటు చంద్రబాబు కానీ ఇప్పటివరకూ దీనిపై స్పందించడం లేదు. విభజన హామీల్లో కీలకమైన రైల్వే జోన్ ఇచ్చే ఉద్దేశం లేదని కేంద్రం చెప్పేసినా దీనిపై ఎలాంటి విమర్శలు చేసేందుకు కూడా ఇష్టపడటం లేదు. కార్యాచరణ అంత పెద్ద మాటలు కాకపోయినా కనీసం కేంద్రంతో మాట్లాడతామని సైతం చెప్పేందుకు వీరిద్దరూ జంకుతున్నారు.
ఎవరి బలహీనతలు వారివి
సీఎంగా ఉన్న జగన్, విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇద్దరికీ కేంద్రంతో అవసరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఓవైపు జగన్ కేంద్రం నుంచి నిధుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఎన్డీయేతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. దీంతో వీరిద్దరి బలహీనతల్ని అర్ధం చేసుకున్న కేంద్రం.. ఏపీతో మరోసారి ఫుట్ బాల్ ఆడుకోవాలని నిర్ణయించేసుకున్నట్లు అర్ధమవుతోంది. అయినా కేంద్రాన్ని కనీసం ప్రశ్నించలేని పరిస్ధితుల్లోకి వీరిద్దరూ దిగజారిపోతున్నారు. గతంలో ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేసే క్రమంలో అయినా కేంద్రంపై విమర్శలు చేసిన చరిత్ర ఉన్న జగన్, చంద్రబాబు ఇప్పుడు అలా కూడా విమర్శలు చేసేందుకు ఇష్టపడం లేదు. విమర్శలు చేస్తే అవి కేంద్రాన్ని ఎక్కడ తాకుతాయో, తమ సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయో అన్న భయం వీరిలో కనిపిస్తోంది.
జగన్, చంద్రబాబు నోరెత్తితే..
కేంద్రం రాష్ట్రానికి ఎంతగా అన్యాయం చేస్తున్నా జగన్, చంద్రబాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ కేంద్రంపై నోరెత్తితే ఏం జరుగుతందనే దానిపై వీరిద్దరికీ పిచ్చ క్లారిటీ ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్ నోరెత్తితే ఆయనపై విచారణ దశలో ఉన్న అక్రమాస్తుల కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నోరెత్తితే ఎన్డీయేలోకి భవిష్యత్తులో టీడీపీకి ద్వారాలు పూర్తిగా మూసుకుపోవడం ఖాయం. అంతే కాదు ఓటుకు నోటు వంటి పాత కేసుల్ని కూడా కేంద్రం తిరగతోడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో జగన్ కానీ, చంద్రబాబు కానీ ఇప్పట్లో కేంద్రంపై నోరెత్తే అవకాశాలు కనిపించడం లేదు. ఏపీకి ఎంత అన్యాయం జరిగినా మేం మాత్రం మా ప్రయోజనాలే చూసుకుంటామనే ధోరణి వీరిద్దరిలో కనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.