బియాస్ ట్రాజెడీ: నీళ్లు తగ్గించి గాలింపు, బర్త్డే ఉందని...
హైదరాబాద్: బియాస్ నదిలో గల్లంతై మరణించిన హైదరాబాద్కు చెందిన విద్యార్థుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. రూ.1.50 లక్షలను పరిహారంగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు సహా 24 మంది విద్యార్థులు గల్లంతవగా, ఇప్పటి వరకు ఐదు మృత దేహాలు దొరికాయి.
నీళ్లు తగ్గించి మృతదేహాల కోసం గాలింపు
బియాస్ నదిపై లార్జి డ్యామ్ నుంచి దిగువకు నీటి మట్టాన్ని తగ్గించి గల్లంతైన తెలుగు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. దిగువన 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండా డ్యామ్ ఒక గేటును పైకి ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. మృతదేహాలు కొట్టుకుపోకుండా అక్కడ వల ఏర్పాటు చేశారు. లార్జి డ్యామ్ నుంచి నీటి ప్రవాహం తగ్గినప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. అప్పుడప్పుడు నీటి ఉధృతి పెరుగుతోంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బంది అవుతోంది.
నదీ భాగం లోతైన ప్రాంతం కావడం, నది అడుగున బురద ఉండడం వల్ల సహాయక చర్యలకు ప్రతికూలంగా మారింది. దీంతో ఆలస్యంగానైనా మృతదేహాలను వెలికి తీయడం ఖాయమని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు చెబుతున్నారు. ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టమని, పది రోజులు కూడా పట్టవచ్చన్నారు. 10 పడవలతో రెండు ప్రాజెక్టుల మధ్య విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పుట్టిన రోజు కోసం బట్టలు తీసుకెళ్లి....
గల్లంతైన విద్యార్థుల్లో ఇద్దరిది ఒకేరోజు పుట్టిన రోజు. వారి పేరు కూడా ఒక్కటే. గల్లంతైన వారిలో అఖిల్ పేరుతో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. చౌటుప్పల్కు చెందిన సబిత, సుదర్శన్ల తనయుడు అఖిల్. ఈ నెల 12న అఖిల్ పుట్టిన రోజు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో పుట్టిన వేడుకలు జరుపుకునే అఖిల్.. ఈసారి స్నేహితుల మధ్య చేసుకుంటానని.. కొత్త దుస్తులు కొనుక్కొని వెళ్లాడు. అయితే అతను విషాదంలో గల్లంతయ్యాడు.
మరోవైపు వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన సునిత, సంజయ్ కుమార్ల తనయుడు మిట్టపల్లి అఖిల్. ఇతని పుట్టిన రోజు కూడా 12నే. ఇరువురు కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందామనుకున్నారు. కానీ రెండు రోజుల ముందు వారు గల్లంతయ్యారు.