బురదలో కూరుకుపోయిన విమానం, ఆందోళన: రేణిగుంటకు విమానాల రద్దు
చిత్తూరు: గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వేగ నియంత్రణలో వైఫల్యం, రన్ వేపై కొన్ని లైట్లలో ఏర్పడిన సాంకేతిక లోపం, కారణాలేమైతేనేం.. హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్న స్పైస్ జెట్ విమాన ప్రయాణికులను కాసేపు తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో ల్యాండయిన స్పైస్ జెట్ విమానం, రన్ వేను దాటి బయటకు వెళ్లి, అరకిలోమీటర్ దూరం ప్రయాణించి బురదలో కూరుకుపోయింది. విమానంలో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉండగా, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు.
రన్ వే దాటి విమానం ముందుకెళ్లడంతో తాము భయపడినట్టు ప్రయాణికులు వ్యాఖ్యానించారు. మరో పావు కిలోమీటర్ దూరంలో ప్రహరీ గోడ ఉండటంతో, విమానం మరికాసేపు ప్రయాణించివుంటే, పెను ప్రమాదమే జరిగుండేదని తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో రాత్రి నుంచి విమానాశ్రయం నుంచి సర్వీసులు నిలిచిపోగా, ఆదివారం ఉదయం డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు ఎయిర్ పోర్టును, రన్ వేను సందర్శించారు. బురదలో కూరుకుపోయిన విమానాన్ని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కాగా, పలు విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.