ఏపీ చరిత్రలోనే తొలిసారి- నిమ్మగడ్డకు ఉద్యోగుల ధిక్కారం- చాలా రిస్క్ అంటున్న ఐవైఆర్
ఏపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉద్యగులు సమరశంఖం పూరించారు. ప్రభుత్వం సిద్ధంగా లేని స్ధానిక సంస్ధల ఎన్నికలను తాము మాత్రం ఎందుకు ఎదుర్కోవాలంటూ భీష్మించారు. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కమిషనర్ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయని తెలిసీ ధిక్కారానికి సిద్దమైపోతున్నారు. సాక్ష్యాత్తూ అఖిల భారత సర్వీసు అధికారులు సైతం నిమ్మగడ్డను ధిక్కరిస్తూ సర్కారుకు అండగా నిలుస్తున్నారు. దీంతో ఉద్యోగులు సహకరించని చోట్ల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా పెద్ద రిస్క్ అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సైతం వ్యాఖ్యానించారు.
Recommended Video
ఎస్ఈసీపై ఉద్యోగుల ధిక్కారస్వరం
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న వైఖరితో వైసీపీ ప్రభుత్వం ఇరుకునపడింది. అప్పటి నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డపై మొదలైన దాడి ఆయన్ను పదవి నుంచి తొలగించే వరకూ వెళ్లింది న్యాయస్ధానాల జోక్యంతో తిరిగి పదవిలోకి వచ్చిన నిమ్మగడ్డ కొన్ని నెలలుగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. ఇదే క్రమంలో ఉద్యోగులు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని కాదని త్వరలో పదవీ విరమణ చేసే నిమ్మగడ్డకు సహకరించడం ఎందుకని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నిమ్మగడ్డ ఆదేశాలన్నీ బుట్టదాఖలు
రాజ్యాంగ పదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ జారీ చేసిన ప్రతీ ఆదేశాన్నీ బుట్టదాఖలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్ఱభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే నిమ్మగడ్డ కోరిన విధంగా ఓటర్ల జాబితా ఇవ్వడం కానీ, నిధుల విడుదల కానీ, క్షేత్రస్దాయిలో ఇతరత్రా సహకారం అందించేందుకు ఉద్యోగులు నిరాకరించారు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న వ్యాక్సిన్ సాకుతోనే నిమ్మగడ్డకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అలాగే గతంలో ఎన్నికల సందర్భంగా అక్రమాలకు సహకరించారనే అరోపణలు ఎదుర్కొంటూ నిమ్మగడ్డ బదిలీ చేయాలని కోరిన ఐఏఎస్లు, ఐపీఎస్లను సైతం ప్రభుత్వం బదిలీ చేయలేదు.
తోటి అధికారి అయినా నిమ్మగడ్డను పట్టించుకోని ఏఐఎస్లు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ జారీ చేసే ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిన అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ఆయనకు ధిక్కార స్వరమే వినిపిస్తున్నారు. కనీసం తమతో పాటు పనిచేసిన అఖిల భారత సర్వీసు అధికారిగా కూడా ఆయన్ను గౌరవించేందుకు సిద్ధం కావడం లేదు. దీంతో గతంలో తాను సూచించిన బదిలీలను చేయడం కష్టమని ఆయనకే తేల్చిచెప్పేశారు. ఏకంగా సీఎస్ పదవిలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సైతం నిమ్మగడ్డ ఆదేశాలను లెక్కచేసే పరిస్ధితుల్లో లేరు. రేపు నిమ్మగడ్డ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి బాస్ అయిన ఆదిత్యనాద్ దాస్ జవాబుదారీ అవుతారు. కానీ ఆయనే ఉద్యోగులను నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చాలా పెద్ద రిస్క్ అంటున్న ఐవైఆర్
ఎన్నికల కమిషనర్ స్ధానంలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ జారీ చేసిన ఆదేశాలను అధికారులు తప్పకుండా పాటించాల్సిందేనని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండబోదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చెప్తున్నారు. కానీ ఐఏఎస్, ఐపీఎస్లు సైతం ఎస్ఈసీని ధిక్కరించడం చాలా పెద్ద రిస్క్ అవుతుందని కృష్ణారావు తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలే అంతిమం అని ఆయన చెబుతున్నారు. గతంలో మాజీ సీఈసీ శేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పిందని ఆయన గుర్తు చేస్తున్నారు.
శేషన్ కేసులో సుప్రీం తీర్పు ఇదీ...
కేంద్ర ఎన్నికల సంఘానికి ఛీఫ్ కమిషనర్గా గతంలో వ్యవహరించిన టీఎన్ శేషన్కు చండశాసనుడనే పేరుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఆయన అస్సలు సహించేవారు కాదు. ఎంత పెద్ద అధికారి అయినా వేటు వేసేందుకు సిద్ధమైపోయేవారు. దీంతో శేషన్ హయాంలో అధికారులు బెంబేలెత్తిపోయేవారు. 1995లో సుప్రీంకోర్టులో దాఖలైన శేషన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఎన్నికల సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని, కేవలం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. దీనిబట్టి చూసినా నిమ్మగడ్డ ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాల్సిందే.