చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు- అమిత్షాతో జగన్ భేటీ అజెండా ఇదే- త్వరలో ప్రధానితో..
ఏపీలో టీడీపీ హయాంలో రాజధాని అమరావతి భూసేకరణలో చోటుచేసుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు ఫైబర్ గ్రిడ్ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ వైసీపీ సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే అంశాన్ని కేంద్రం కూడా అంగీకరిస్తే సీబీఐ దర్యాప్తు ప్రారంభం కానుంది. అయితే కేంద్రం ఇందుకు ఒప్పుకుంటుందా లేక సీఎం జగన్ను నిరాశపరుస్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోయే అవకాశముంది. రాజకీయ కారణాలతో ప్రత్యర్ధులపై సీబీఐ దర్యాప్తు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తే అవకాశం ఉండటం, ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి వ్యవహారాలను సాంకేతికంగా నిరూపించే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలు సీబీఐ దర్యాప్తుకు అవరోధంగా మారనున్నాయి. దీంతో కేంద్రం తీసుకునే నిర్ణయంపైనా ఉత్కంఠ రేపుతోంది.
జగన్ ఢిల్లీ టూర్ అజెండా...
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన హోంమంత్రి అమిత్షాతో ఇవాళ సాయంత్రం సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్ లభించింది. అమిత్షాతో భేటీ కీలకంగా మారిన నేపథ్యంలో జగన్ ఇందుకోసం ప్రత్యేక అజెండాతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టూర్లో జగన్ మిగతా కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్రంతో జగన్ చర్చించబోతున్నారు. అయితే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ మాత్రం ఇంకా దొరకలేదని తెలుస్తోంది. ఇవాళ అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులతో భేటీ తర్వాత జగన్ రేపు ఉదయం తిరిగి అమరావతికి పయనం కానున్నారు.
చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు...
ఈ టూర్లో జగన్ ప్రధానంగా విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై సీబీఐ విచారణ కోసం కేంద్రాన్ని కోరబోతున్నట్లు తెలుస్తోంది. అమరావతి భూసేకరణ సందర్భంగా చోటు చేసుకున్న ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు ఫైబర్ గ్రిడ్ బాక్సుల్లో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే దీన్ని కేంద్రం కూడా అంగీకరిస్తేనే సీబీఐ విచారణ ప్రారంభమవుతుంది. దీంతో జగన్ సీబీఐ విచారణకు ఆదేశించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరాలని భావిస్తున్నారు. ఓ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశంలో, అలాగే కేంద్రం నిధులిచ్చిన అమరావతి విషయంలో అవినీతి జరిగిందని బీజేపీ కూడా గతంలో విమర్శలు చేసిన అంశాన్ని జగన్ అమిత్షాకు గుర్తు చేయబోతున్నారు. అమరావతిపై ఇప్పటికే జరుగుతున్న ఏసీబీ, సీఐడీ, ఈడీ దర్యాప్తు వివరాలను కూడా జగన్ అమిత్షాకు ఇవ్వబోతున్నారు.
చంద్రబాబుపై చర్యలకు కేంద్రం అనాసక్తి...
టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అవినీతి పేరుతో అమరావతి, ఫైబర్ గ్రిడ్ వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతున్నా కేంద్రం మాత్రం ఈ విషయంలో ఆసక్తిగా లేదని తెలుస్తోంది. గతంలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంత ఎన్డీయే నుంచి తప్పుకున్న టీడీపీ.. ఆ తర్వాత చేసిన ధర్మపోరాటం మోడీ కానీ అమిత్షా కానీ మర్చిపోలేదు. అయితే ప్రస్తుతం రాజకీయంగా టీడీపీతో ప్రత్యేకంగా అవసరం అంటూ లేదు. అలాగని టీడీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నికలకు ముందు ఈ లెక్కలు చూసుకోవచ్చన్న భావన బీజేపీ పెద్దల్లో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కేంద్రం స్పందన చూశాకే వైసీపీ ఎంపీలు పార్లమెంటు బయట సీబీఐ దర్యాప్తు కోసం ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో ఈసారి ఏకంగా సీఎం జగన్ రంగంలోకి దిగినట్లు అర్ధమవుతోంది. అయితే జగన్ కోరికను కేంద్రం మన్నిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
Recommended Video
త్వరలో ప్రధానితో భేటీ...
చంద్రబాబు, లోకేష్పై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రంపై జగన్ ఎంత ఒత్తిడి తెస్తున్నా మోడీ-అమిత్షా కోరుకుంటే తప్ప అది జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం రాజకీయ పరిస్ధితులను గమనిస్తే తమకు అనుకూలంగానే వ్యవహరిస్తున్న టీడీపీపై సీబీఐ దర్యాప్తు అవసరం ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో కేంద్రం తక్షణం దీనిపై నిర్ణయం తీసుకోకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం మరింతగా ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్ త్వరలో ప్రధానితో భేటీకి అపాయింట్మెంట్ కోరుతున్నారు. కానీ ఇవాళ, రేపట్లో ప్రధానితో భేటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అందుకోసమే ఈ నెల 25న మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. అందుకోసమే 25న జరగాల్సిన కేబినెట్ భేటీని కూడా వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.