రోహిత్ ఇంటికి జగన్: కోర్టు ఆదేశాలు పాటించినా హెచ్సియు విద్యార్థి దక్కేవాడు!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య చేసుకోగా, ఇది ఇది రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే.
మంగళవారం సాయంత్రం జగన్ ఉప్పల్లోని రోహిత్ ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
సస్పెన్షన్ దారుణం: ఉప్పులేటి కల్పన
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మంగళవారం నాడు డిమాండ్ చేశారు. దళిత విద్యార్థులు అనే కారణంతో వారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
విశ్వవిద్యాలయాలలో కులాల కంపు రావణ కాష్టంలో మారిందని ఆమె ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మిగిలిన నలుగురు విద్యార్థుల పైన వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. ఉన్నతస్థాయి కమిటీని నియమించి నిజాలు బయటకు తీయాలన్నారు.
కోర్టు ఆదేశాలు పాటించినా రోహిత్ దక్కేవాడు!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం గతంలోను జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఎం (లింగిస్టిక్స్) చదువుతున్న 21 ఏళ్ల పి రాజు 2013లో యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇది అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది.
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయాలు సహా పలు విశ్వవిద్యాలయాల క్యాంపస్లలో అప్పటి వరకు జరిగిన 24 మంది విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆ పిల్ పేర్కొంది.
విద్యార్థులు వచ్చిన సామాజిక పరిస్థితుల గురించి అవగాహన చేసుకోకుండా వర్సిటీ అధికారులు, అధ్యాపకులు ఒత్తిడికి గురి చేయడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆ పిల్లో ఆరోపించారు. ఆరు సెమిస్టర్లలో మంచి గ్రేడ్ తెచ్చుకున్న రాజు ఏడో సెమిస్టర్లో గ్రేడ్ దిగజారినందుకు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని అందులో వివరించారు.
తాను మానసిక ఒత్తిడికి గురవుతున్న వి,యాన్ని రాజు ఆస్ట్రేలియాలో ఉన్న స్నేహితురాలికి చెప్పగా.. వర్సిటీ అధికారులు, అధ్యాపకుల సాయం తీసుకోవాలని ఆమె అతనికి సూచించారు. అయితే వర్సిటీలో సాయం చేసేందుకు ఎవరూ రాలేదని రాజు బాధపడ్డారని, ఆ తర్వాత మధనపడి చివరకు ఆత్మహత్యనే ఆశ్రయించారని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఏపీ హైకోర్టు 2013, జూలై ఓకటో తేదిన విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అమలు చేయాల్సిన మార్గదర్శకాల గురించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వారితోని ఓ కమిటీ వేయాలని, వాటిని ఎప్పటికప్పుడు విచారించి పరిష్కరించేందుకు అకడమిక్ కమిటీ ఉండాలని, వీలైతే ప్రతి విభాగానికి ఒక అకడమిక్ కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.
రెండు కమిటీల మధ్య సమన్వయం కోసం అంబుడ్స్మెన్ ఉండాలని చెప్పింది. రాష్ట్రంలోన్ని అన్ని వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అంగవికలురకు ప్రత్యేక ప్రిపేటరీ కోర్సులు, బ్రిడ్జి కోర్సులు ప్రవేశ పెట్టాలని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కౌన్సిలర్లను నియమించాలని కోర్టు సూచించింది.
నల్సార్ లా విశ్వవిద్యాలయం సహాయం తీసుకోవాలని చెప్పింది. కాలేజీల్లో అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు యూజీసీ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు చెప్పింది. పలు సూచనలు చేసింది. అయితే, వాటిని పట్టించుకోలేదని అంటున్నారు.