రంజుగా కోడిపందేలు: తెలంగాణ పుంజు వర్సెస్ ఆంధ్రా పుంజు..
యి. పశ్చిమగోదావరి జిల్లా వెంపలో నిర్వహించిన కోడిపందేల్లో తెలంగాణ రాష్ట్రం పుంజుకు, వెంప గ్రామానికి చెందిన పుంజుకు మధ్య పందెం నిర్వహించారు.
భీమవరం: ఆంక్షల మాట చెల్లలేదు.. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఇంకేముంది.. ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతి కూడా కోడి పందేలతో భలే రంజుగా సాగిపోయింది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా.. రేయింబవళ్లు కోడిపందేలు జరిగిన తీరు జాతర వాతావరణాన్ని తలపించిందనే చెప్పాలి.
నోట్ల రద్దు ఎఫెక్ట్ ఉంటుందని తొలినుంచి భావించినా.. అలాంటిదేమి మచ్చుకు కూడా కనిపించలేదు. కొత్త నోట్ల ధగధగలతో పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. ఒక్క ఆంధ్రా మాత్రమేనా? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కోడి పందేల కోసం తరలి వచ్చారు.
ప్రజా ప్రతినిధులే ముందుండి మరీ..
చాలాచోట్ల ప్రజాప్రతినిధులే ముందుండి కోడి పందేలను నిర్వహించడంతో బందోబస్తులో ఉన్న పోలీసులంతా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఉభయగోదావరి జిల్లాల్లోనే సుమారు రూ.150 నుంచి 200 కోట్ల పందేలు జరిగి ఉంటాయని అంచనా. కోడిపందేలతో పాటు పేకాట, గుండాటలు కూడా జోరుగా జరిగాయి.
బరిలో దిగిన ఎమ్మెల్యే:
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి వెంప గ్రామం పరిధిలో కోడిపందేలు కాశారు. దాదాపు 9పందేలు ఆడిన ఆయన సుమారు రూ.5లక్షల దాకా బెట్టింగ్ కాసినట్టు తెలుస్తోంది. పందేల్లో సదరు ఎమ్మెల్యే మూడు పందేలను గెలుపొందగా.. వెంప గ్రామం ప్రజలు ఆరు గెలుచుకున్నారు.
ఓడిన పందేం కోళ్లకు భలే డిమాండ్:
గెలిచినా.. ఓడినా.. పందెం కోడి పందెం కోడే. దాదాపు ఆర్నెళ్ల పాటు డ్రై ఫ్రూట్స్ వంటి బలవర్థకమైన ఆహారంతో పందెం కోళ్లను పెంచుతారు కాబట్టి.. వాటి రుచి కూడా భలే ఉంటుందంటారు. అందుకే పందేలల్లో ఓడిన కోళ్లకు ఒక్కోదానికి రూ.3 నుంచి రూ.4వేల ధర పలికింది. పందెంలో ఓడిన కోడిన క్వాజాగా పిలుస్తారు.
తెలంగాణ పుంజు వర్సెస్ ఆంధ్రా పుంజు:
కోడి పందేల్లో తెలంగాణ పుంజులు సైతం సందడి చేశాయి. పశ్చిమగోదావరి జిల్లా వెంపలో నిర్వహించిన కోడిపందేల్లో తెలంగాణ రాష్ట్రం పుంజుకు, వెంప గ్రామానికి చెందిన పుంజుకు మధ్య పందెం నిర్వహించారు. దీంతో ఈ రెండింటిపై భారీగా బెట్టింగ్ పెట్టారు. రూ.20లక్షల దాకా ఈ పందెం మీద బెట్టింగు జరిగినట్టు సమాచారం.