ఉత్తరాంధ్రలో వైట్గా మారుతోన్న కోట్ల రూపాయల బ్లాక్ మనీ
విశాఖపట్నం : కొత్త నోట్ల రద్దు బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగిత్తిస్తున్న మాట నిజం. కానీ అక్రమంగా కూడబెట్టుకున్న డబ్బును తిరిగి వైట్ గా మార్చుకునేందుకు వారంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొన్ని సంస్థలు, బడాబాబులు నమ్మకస్తులైన బినామీలను ఏర్పరుచుకుంటుండగా.. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో ఏకంగా ఊర్లకే ఊర్లనే బినామీలుగా మార్చే ప్రయత్నం యథేచ్చగా జరిగిపోతున్నట్టు తెలుస్తోంది.
Photos : 500 - 1000 నోట్లు ఎక్స్చేంజి
అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో.. ఎటూ పాలుపోని కొంతమంది పెద్దలు.. సమీపంలోని ఆయా గ్రామాల పెద్దలను ఆశ్రయించి.. కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆ మేరకు బడా బాబుల నుంచి స్వీకరించిన భారీ మొత్తాన్ని ఊరి ప్రజల ఖాతాల్లో డిపాజిట్లు చేయించి.. నల్లధనాన్ని కాస్త తెల్లధనంగా మార్చే బాధ్యతలను గ్రామ పెద్దలు తీసుకుంటున్నారు.
Photos : పాత నోట్లతో తిప్పలు
ఈ తతంగం మొత్తాన్ని సవ్యంగా జరిపించినందుకుగాను సదరు గ్రామ పెద్దకు భారీగానే ముట్టజెబుతున్నారు బడాబాబులు. ఇదే తరహాలో విశాఖకు చెందిన ఓ ప్రముఖుడి నుంచి విజయనగరంలోని ఓ గ్రామ పెద్దకు రూ.10కోట్లు వచ్చి చేరాయి. వాటిని తమ ఊరి ప్రజల ఖాతాల్లో తలా రూ.2లక్షలు చొప్పున డిపాజిట్ చేయించారు సదరు గ్రామ పెద్ద. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ డబ్బును విత్ డ్రా చేసి.. రూ.7కోట్లు ఆ ప్రముఖుడికి ఇచ్చేసి, మిగతా రూ.3కోట్లను గ్రామ పెద్ద ఉంచేసుకోవడమనే ఒప్పందం మేరకు ఈ వ్యవహారమంతా నడుస్తోంది.
తమ ఖాతాల్లో పొదుపు చేసుకున్నందుకు గాను ఊరి ప్రజలకు ఎంత చెల్లించేది.. ఆ గ్రామ పెద్ద ఇష్టానికే వదిలేశాడు ఆ ప్రముఖుడు. తనకు మాత్రం రూ.7కోట్లు వెనక్కి ఇచ్చేయాలనేది ఒప్పందం. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇప్పుడిలాంటి వ్యవహారాలు జోరుగా సాగుతుండడంతో.. ఎస్.బీ.ఐలో దాదాపు రూ.567కోట్లు వచ్చి పడ్డాయి. మిగతా బ్యాంకుల్లో రూ.433కోట్లు వచ్చి పడ్డాయి. ఇదంతా కేవలం ఉత్తరాంధ్ర పరిధిలోని బ్యాంకుల్లో జమ అయిన మొత్తం మాత్రమే.
గతంలో నిర్దేశించిన డిపాజిట్లను చేరుకోవడమే కష్టంగా ఉండే ఉత్తరాంధ్ర బ్యాంకులకు ఇప్పుడింత భారీ మొత్తంలో డిపాజిట్లు వచ్చి చేరుతుండడంతో.. అనుమానాలు తలెత్తుతున్నాయి.ఆరిలోవ, మద్దిలపాలెం, వెలంపేట, కొత్తరోడ్డు, తాటిచెట్లపాలెం, కైలాసపురం, గాజవాక తదితర ప్రాంతాల్లో ఈ వ్యవహారం భారీ ఎత్తున జరుగుతున్నట్టు సమాచారం.