నోట్ల కట్టలు: బెజవాడ దుర్గ గుడి హుండిలో కొత్త రూ.2000 నోట్లు కూడా
విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో పలు ఆలయాలు కాసులతో నిండిపోతున్నాయి. ఏపీలోని ప్రధాన ఆలయాల పైన కూడా నరేంద్ర మోడీ రద్దు ప్రభావం పడింది. పెద్ద ఎత్తున హుండీలలో డబ్బులు పడుతున్నాయి. పాత నోట్లు ఎక్కువగా అందులో వేస్తున్నారు.
రూ.500, రూ.1000 నోట్లు బయట చలామణిలో లేవు. ఈ నేపథ్యంలో వాటిని భక్తులు హుండీలలో వేస్తున్నారు. దుర్గ గుడి లెక్కింపు సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయమేమంటే.. పాత నోట్లతో పాటు కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.2000 నోట్లు కూడా హుండీల్లో దర్శనమిచ్చాయి.
కాగా, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖ స్పందించిన విషయం తెలిసిందే. ఏపీలోని అన్ని దేవాలయాల్లోనూ హుండీలను తెరిచి చిల్లరను బ్యాంకులకు చేరవేయాలని మంత్రి మాణిక్యాల రావు ఆదేశించారు.
ఆ చిల్లర బ్యాంకుల నుంచి ప్రజలకు చేరుతుందని తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో నెలకొన్న చిల్లర సమస్యను పరిష్కరించేందుకు ఒక భక్తుడు ఇచ్చిన సూచనతో అన్ని ఆలయాల్లోని హుండీల చిల్లరను బ్యాంకుల ద్వారా ప్రజలకు అందేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. టీటీడీ సహా మొత్తం 24 వేల దేవాలయాల్లోని హుండీల ద్వారా చిన్న నోట్లను, చిల్లరను సేకరించి బ్యాంకుల్లో జమ చేస్తామన్నారు.