ధనప్రవాహం: గుంటూరులో బంగారం, విశాఖలో నగదు, కడపలో చీరెలు..!
అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాలుగు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల లెక్క చూపని నగదు బయటపడ్డాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రతి జిల్లాలో, ప్రతి చోటా ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు నల్లధనాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమవాళి అమల్లో ఉందని తెలిసినప్పటికీ.. కళ్లుగప్పి నగదును తరలించే ప్రయత్నంలో పోలీసుల చేతికి దొరికిపోతున్నారు. ఎన్నికల్లో ధనప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత తొలి నాలుగు రోజుల్లో వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల 76 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నగదుతో పాటు సుమారు 18 కేజీల బంగారాన్ని తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని అన్నారు.
361 కోట్ల ఫీజు బకాయిలు..! చదువులు ముందుకు సాగేదెలా అమాత్యా..??
రూ.10 వేలను కూడా స్వాధీనం చేసుకుంటాం: ద్వివేది
సరైన ఆధారాలను చూపించకపోతే.. 10 వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకుంటామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఏటీఎంలల్లో నగదును డ్రా చేస్తే.. ఆ స్లిప్పులను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 6,600 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6,160 స్టాటిక్, వీడియో సర్వైవలెన్స్ బృందాలను మోహరింపజేశామని అన్నారు.
భారీగా చెక్ పోస్టులు..
రాష్ట్ర సరిహద్దుల్లో 31 ఎక్సైజ్ చెక్ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. వాటితో పాటు 46 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, 18 సరిహద్దు మొబైల్ పార్టీ చెక్పోస్టులను , 161 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని ద్వివేది తెలిపారు.
పెదకాకాని వద్ద రూ.67 లక్షల నగదు పట్టివేత..
వాహనాల తనిఖీల సందర్భంగా గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నగదు వెలుగు చూసింది. బంగారం, వెండి అభరణాలు దీనికి అదనం. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 67 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 18.51లక్షల రూపాయలను తరలిస్తున్న వాహనాన్ని విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలోని ద్వారాకా నగర్ నుంచి మర్రిపాలెం ఉడా లేఅవుట్ సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారులో 18.51 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో హైదరాబాద్ కు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి కారు నుంచి పోలీసులు తొమ్మిది లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించడంతో వదిలేశారు.
గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలంలోని శిరిపూడి గ్రామంలో శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద నుంచి 3 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు. ఆధారాలు సమర్పించడంతో నగదును తిరిగి ఇచ్చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని బోయపాలెం వద్ద 3.563 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం నగల దుకాణాలకు చెందినవిగా తేలింది. తిరుపతి నుంచి విజయవాడకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న పత్రాలు అనుమానాస్పదంగా ఉండటంతో బంగారాన్ని సీజ్ చేశారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు లెక్క చూపని 16 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కడప నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న బస్సులో ఈ నగదు బయటపడింది. కడప శివార్లలో కారులో పెద్ద ఎత్తున తరలిస్తున్న చీరెలను గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చీరెల విలువ అయిదు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.