జగన్ తీరు అప్పుడు అనావృష్టి...ఇప్పుడు అతివృష్టా?...ఈసారి దెబ్బ ఇలానా?
విజయవాడ: 2014లో ఓటమికి కారణాలపై వైసిపి అధినేత జగన్ మనసులోని భావం ఏమిటో తెలియదు కానీ అప్పటికీ ఇప్పటికీ జగన్ వైఖరిలో వచ్చిన కొన్ని మార్పులకు ఆయన పాదయాత్రే రుజువుగా నిలుస్తోంది.
Recommended Video
గత ఎన్నికల సమయంలో ప్రతి విషయంలో అనావృష్టిని తలపించిన జగన్ వైఖరి ప్రస్తుతం అతి స్పందనతో అతివృష్టిని తలపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీ అధినేతలకు అతి కూడదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ సంయమనం పాటించగలిగిన వారే అంతిమంగా విజయం సాధించగలుగుతారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నష్టం జరిగిందని పరిస్థితులు గమనించకుండా గత వైఖరికి పూర్తి భిన్న వైఖరి ప్రదర్శిస్తే మళ్లీ అంతామంగా నష్టపోకతప్పదంటున్నారు. జగన్ గత వైఖరిలో...ప్రస్తుత వైఖరిలో మార్పులపై రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఇలా ఉంది.
అప్పుడు అనావృష్టి...ఎలాగంటే?
అప్పుడు జగన్ వైఖరి అనావృష్టిని తలపించేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలాగంటే...అప్పట్లో జగన్ కనీసం తమ పార్టీనేతలతో సహా మాటలే కరువా అన్నట్లుగా ఉండేవారని...ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా బాగానే ఇస్తున్నారనేది వారి అభిప్రాయం. ఇక ఎన్నికల హామీల విషయానికొస్తే అప్పట్లో రైతులకు సంబంధించి టిడిపి ఎన్నికల హామీకి పోటీగా మీరు కూడా అదే హామీ ఇవ్వమని ఆ పార్టీ నేతలు ఎంతగా కోరినా జగన్ ఏమాత్రం వినిపించుకోలేదట. పైగా మీరే కన్విన్స్ అవ్వాలన్నట్లుగా ఉండేదట పరిస్థితి.
కానీ ఇప్పుడు...హామీల వర్షం
కానీ ఇప్పుడు పాదయాత్రలో జగన్ హామీల వర్షం ఆ పార్టీ నేతలకే ఆశ్చర్యం కలిగిస్తోందట అంతే కాదు భయం కూడా వేస్తోందట...ఇన్ని హామీలు అమలు చేయాలంటే ఎవరికైనా కష్టమేనని...అంతగా హామీల వర్షం కురిపించాల్సిన అవసరం లేదోమోనని ఆ పార్టీలో సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారట. కారణం అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరని...ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుందనే విషయాన్ని జగన్ గమనించాలని వారిలో వారు చర్చించుకుంటున్నారట. అయితే ఆ విషయాన్ని జగన్ చెప్పే సాహసం మాత్రం చేయడం లేదట.
పార్టీలో చేరికలు...అప్పుడు నో...
ఇక పార్టీలో చేరికల విషయానికొచ్చేసరికి అప్పుడు పలువురు తటస్థ కేటగిరి వ్యక్తులు చాలామంది ముందు వైసిపిలో చేరడానికే ప్రయత్నం చేశారట. అయితే జగన్ వాస్తవ పరిస్థితి ఏమాత్రం అధ్యయనం చేయకుండానే ముందుముందుగానే నిర్మొహమాటంగా నో చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చేవారట. ఉదాహరణకు జెసి,గంటా, ఆనం, రావెల తొలుత వైసిపి తరుపున పోటీ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారట. అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు,ఎంపీ అభ్యర్థులు కూడా ముందు వైసిపికి ప్రయత్నించినా ఏ మాత్రం లెక్కచేయలేదట. అయితే వారే ఆ తర్వాత టిడిపిలో చేరి వైసిపి అభ్యర్థుల మీదే విజయ ఢంకా మోగించడం జగన్ కు విస్మయం కలిగించిందట.
అదే చేరికలకు...ఇప్పుడు... తలుపులు బార్లా
ఇప్పడు పార్టీలో చేరికల విషయంలోనూ జగన్ తన వైఖరి మార్చుకున్నారట. సీట్ల పునర్విభజన లేదని తేలిపోవడంతో టిడిపిలో సీటు రావడం కష్టమని తేలిపోయినవారందరూ వైసిపి వైపు పక్కచూపులు చూస్తున్నారట. ఇప్పుడు పార్టీలో చేరికల విషయానికొస్తే సరిగ్గా 2014 నాటి పరిస్థితులే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. అయితే జగన్ తన గత వైఖరికి భిన్నంగా ఆ నియోజకవర్గంలో వారి ఆవశ్యకత గురించి కనీసం ఆలోచించకుండానే వచ్చిన వాళ్లకు వచ్చినట్లు తమ పార్టీ కండువా కప్పేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈసారి ఈ అతివృష్టితోనే...తంటా అంటున్నారు...
రాష్ట్రంలో అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎంతో మార్పు వచ్చిందని అది గమనించకుండా ఎక్కడా తగ్గొద్దు...ఏదే వెనక్కి అడుగు వేయద్దు అని వాస్తవ పరిస్థితులు పట్టించుకోకుండా అన్నీ వాటేసుకుందామనే అతివృష్టి వైఖరితో జగన్ వ్యవహరిస్తున్నట్లు కినిపిస్తుందని, ఈ సారి ఈ వైఖరే వైసిపికి నష్టం కలిగించవచ్చని...రాజకీయ పరిశీలకులు విళ్లేషిస్తున్నారు. ప్రత్యేక హోదా, మరి కొన్ని వ్యూహాలతో అధికార పార్టీపై పైచేయి సాధించామనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మళ్లీ షాక్ లు తినక తప్పదంటున్నారు. రాష్టంలో మారిన పరిస్థితులను ఆకళింపు చేసుకొని అనావృష్టో...అతివృష్టో కాకుండా ఈ పరిస్థితులను బ్యాలన్స్ చేసుకొని ముందుకు వెళ్లడం వైసిపికి కత్తి మీద సాము లాంటిదేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.