సంక్షేమం కొంత.. అవినీతి కొండంత: పథకాల పేరుతో దోపిడీ: జగన్ సర్కార్పై కన్నా ఫైర్.. !
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి వైఎస్ జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అవినీతిమయమైందని ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి తాము ఉద్యమిస్తామని అన్నారు. అమరావతి ప్రాంతం నుంచి సచివాాలయాన్ని తరలించడంలోనూ అవినీతికి పాల్పడే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.
అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు, అమరావతి పరిరక్షణ కమిటీ ప్రతినిధులు బుధవారం ఉదయం కన్నా లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ తరఫున మద్దతు ప్రకటించాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని విజ్ఙప్తి చేశారు. రెండునెలలుగా తాము చేస్తోన్న పోరాటాన్ని కేంద్రంలో అధికారంలో బీజేపీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు.
అనంతరం కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఒక్క క్షణం కూడా రాష్ట్రం గురించి పట్టించుకునే స్థిలో అధికార పార్టీ నాయకులు లేరని అన్నారు. ప్రభుత్వం పని చేస్తోందని చెప్పుకోవడానికి మాత్రమే ఏవో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, చివరికి వాటిని కూడా అడ్డుగా పెట్టుకుని భారీ ఎత్తున అవినీతి కార్యక్రమాలకు పూనుకుంటున్నారని చెప్పారు.
అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తప్పు పట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతించట్లేదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అవినీతే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోన్న వైఎస్ఆర్సీపీ నాయకులు వాటి గురించి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అవినీతి కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో.. అన్నీ తొక్కుతున్నారని విమర్శించారు.