మడుగుల విధ్వంసం,నాసిరకం పనులతోనే పోలవరం రోడ్డుకు నెర్రెలు:తేల్చిన ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు
అమరావతి:పోలవరం ప్రాజెక్ట్ రహదారి హఠాత్తుగా భారీ పగుళ్లతో చీలికలు పేలికలుగా మారిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కారణాలు...తాజాగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తేల్చిన కారణాలకు పొంతన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రాజెక్ట్ కోసం తవ్విన మట్టిని నిల్వ చేసే డంపింగ్ యార్డు కోసం ఇక్కడి మడుగులను ధ్వంసం చేయడం, మరోవైపు నాసిరకం పనులు వెరసి ఇలా పోలవరం రహదారి నెర్రెలు బారి పోయినట్లు నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలిందట. ఇదేవిధంగా ప్రాజెక్ట్ హెడ్వర్క్స్లో నీటిని నిల్వ చేసే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను నాసిరకంగా చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రోడ్డుకు నెర్రెలు...నేపథ్యం
పోలవరం హెడ్వర్క్స్ పనుల్లో భాగమైన మట్టి తవ్వకం పనులను నామినేషన్ పద్దతిపై త్రివేణి ఎర్త్ మూవర్స్ అనే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. నిబంధనల ప్రకారం పనుల నిమిత్తం తవ్విన మట్టిని తరలించడానికి రహదారి, అలాగే ఆ మట్టిని నిల్వ చేయడానికి స్థలాన్ని కాంట్రాక్టరే సేకరించుకోవాలి. అయితే ఇందుకు భిన్నంగా మట్టిని నిల్వ చేయడానికి అవసరమైన స్థలం(డంపింగ్ యార్డ్)ను రూ.32.66 కోట్లు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాంట్రాక్టర్కు సమకూర్చడం గమనార్హం. ఈ విషయాన్నే కాగ్(కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) రూడా తన నివేదికలో తప్పుబట్టింది.
నిబంధనలు...త్రోసిరాజని
అయితే డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం సమకూర్చిన భూమిలో గతంలో పెద్ద మడుగులు ఉండేవి. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని కొండల్లో కురిసిన వర్షపు నీరు ఈ మడుగుల ద్వారా గోదావరిలో కలవడం జరిగేది. అయితే డంపింగ్ యార్డ్ కోసం ఆ మడుగులను మట్టితో కప్పేయడంతో పరిస్థితి మారింది. మరోవైపు ప్రాజెక్ట్ కోసం తవ్విన మట్టిని తరలించడానికి సర్కార్ నిధులతోనే కాంట్రాక్టర్ రోడ్డు వేశారు. ఈ రోడ్డు మీదుగా వంద టన్నులు సామర్థ్యంతో కూడిన వాహనాలు నిరంతరం తిరగాల్సి ఉండగా...అలాంటి రహదారిని సైతం అత్యంత నాసిరకంగా నిర్మించారని విమర్శలు వెల్లువెత్తాయి.
అందుకే...నెర్రెలు
ఈ నేపథ్యంలో హెడ్ వర్క్స్లో తవ్విన మట్టిని ఈ రహదారికి ఇరువైపులా డంపింగ్ యార్డ్ గా వాడుతున్న స్థలంలో నిల్వ చేస్తూ వస్తుండగా...ఆ క్రమంలో ఇక్కడ ఇప్పటివరకూ తవ్విన 8.93 కోట్ల టన్నుల మట్టిని నిల్వ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కొండల్లో నుంచి వర్షపు నీరు ఈ డంపింగ్ యార్డ్లోకే చేరడంతో ఇక్కడి మట్టి బరువు అంతకంతకు పెరిగిపోవడంతో పాటు రోజురోజుకూ పైపైకి ఎగదన్నుతూ వస్తోంది. దీంతో అసలే నాసిరకంగా నిర్మించిన రహదారి ఒక్కసారిగా నెర్రెలు బారి చీలిలు పేలికలుగా మారి పోయిందని అధికారులే అనధికారికంగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిసింది.
ఆర్టీజిఎస్...తేల్చింది ఇలా
ఈ నేపథ్యంలో పోలవరం రహదారికి భారీ పగుళ్లు సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన ఇంజినీర్లు అందుకు కారణాలను విశ్లేషించారు. మట్టిలో తేమశాతం తగ్గడం, వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రోడ్డు పైకి చొచ్చుకొచ్చిందని తెలిపారు. ఈ పగుళ్లతో పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదమేమీ లేదని..పనులను కొనసాగించవచ్చని ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది. దీన్నే ప్రాజెక్ట్ అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించినట్లు సమాచారం.
ఎన్జీఆర్ఐ...కారణాలు
అయితే పోలవరం రహదారి ఇలా భారీ నెర్రెలు బారడం వెనుక కారణాలు...డంపింగ్ యార్డ్ కోసం చిన్న నీటి వనరులను ధ్వంసం చేసేయడం, నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిన రోడ్డు పనులు నాసిరకంగా ఉండటం వల్లే ఈ రహదారి చీలికలు పేలికలు అయిందని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్( ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే ఇక్కడి రాయి, మట్టి నమూనాలను ప్రాథమికంగా పరిశీలించిన సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (కేంద్ర మట్టి, రాయి పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
పనుల నాణ్యతపై...హెచ్చరికలు
ఈ నేపథ్యంలో పోలవరం రోడ్డు నెర్రెలు బారడం ఒక హెచ్చరిక వంటిదని...పోలవరం హెడ్వర్క్స్లో నీటిని నిల్వ చేసే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనులను కూడా నాసిరకంగా చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో కొనసాగేందుకు వీలుగా సీఎస్ఎంఆర్ఎస్, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగం, ఎన్జీఆర్ఐ ద్వారా తనిఖీలు చేయించి నాణ్యతను నిర్దారించుకున్నతర్వాతే బిల్లులు చెల్లించడం చేయాలని వారు సూచిస్తున్నారు.