ఏపీకి భారీ ఊరట- సగానికి తగ్గిన కరోనా కేసులు- 3 వేల చేరువలో..
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుతోంది. కొన్నిరోజులుగా ఆరువేల కంటే తక్కువగా రోజువారీ కొత్త కేసులు నమోదవుతుండగా.. గత 24 గంటల్లో ఇది 3200కు తగ్గిపోయింది. దీంతో రాష్ట్రానికి భారీ ఊరట దక్కినట్లయింది. దాదాపు ప్రతీ జిల్లాలోనూ కరోనా ప్రభావంలో తగ్గుదల కనిపించింది..
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కేవలం 3200 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 547 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 489 కేసులు వచ్చాయి. గుంటూరులో 379, చిత్తూరులో 293, ప్రకాశంలో 270 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కృష్ణాజిల్లాలో 86 కేసులు రాగా.. శ్రీకాకుళంలో 133, విశాఖలో 135, కర్నూల్లో 136, నెల్లూరులో 166, విజయనగరంలో 191, అనంతపురంలో 209 కేసులు వచ్చాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 7.58 లక్షలకు చేరింది. ఇందులో 7.08 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 32 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు. గుంటూరు, కడపలో నలుగురు చొప్పున చనిపోయారు. అనంతపూర్, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పన మరణించారు. చిత్తూరు, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. వీరితో కలుపుకుని ఏపీలో కరోనా మరణాల సంఖ్య 6256కు చేరింది.